సొంత జిల్లా పర్యటనలో CM Jagan ఏమేం చేయబోతున్నారు..!?

ABN , First Publish Date - 2021-12-23T13:19:39+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నుంచి మూడు రోజులు జిల్లాలో

సొంత జిల్లా పర్యటనలో CM Jagan ఏమేం చేయబోతున్నారు..!?

  • పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు
  • క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొననున్న వైఎస్‌ జగన్‌ 

కడప జిల్లా : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నుంచి మూడు రోజులు జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొననున్నారు. ప్రొద్దుటూరు, పులివెందులలో బహిరంగ సభలలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి కలెక్టర్‌ వి.విజయరామరాజు, ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ అన్ని ఏర్పాట్లు చేశారు.


పర్యటన వివరాలు ఇలా..

- 23వ తేదీ గురువారం 10.30 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 10.40 గంటలకు కడప ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి 11 గంటలకు ప్రొద్దుటూరు మండలం గోపవరం చేరుకుంటారు. అక్కడ స్థానిక నాయకులతో కాసేపు ముచ్చటిస్తారు. 11.10 గంటలకు బొల్లవరం హెలిప్యాడ్‌ నుంచి బయలుదేరి 11.15 గంటలకు ఆ గ్రామంలోని బహిరంగ సభ ప్రాంతానికి చేరుకుంటారు. 11.20 నుంచి 11.35 గంటల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు.


- మధ్యాహ్నం 1 గంట వరకు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. 1.35 గంటలకు గోపవరం ప్రాజెక్టు కాలనీ-1కు చేరుకుంటారు. అక్కడ స్థానిక నాయకులతో కాసేపు ముచ్చటిస్తారు. 1.50 నుంచి 1.55 గంటల వరకు బద్వేలు రెవెన్యూ డివిజన్‌ కొత్త కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. 1.55 నుంచి 2.25 గంటల వరకు మెజర్స్‌ సెంచురీ ప్లై పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. 2.35 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 2.55 గంటలకు సీకేదిన్నె మండలం కొప్పర్తికి చేరుకుంటారు. 


- 3.10 గంటలకు కొప్పర్తి గ్రామంలోని వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ర్టియల్‌ హబ్‌ ఆర్చిని ప్రారంభిస్తారు. 3.25 గంటలకు వైఎస్సార్‌ ఈఎంసీ ఇండస్ర్టియల్‌ ఎన్‌క్లేవ్‌ వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం ప్రారంభిస్తారు. 5.05 గంటలకు ఇడుపులపాయలోని హెలిప్యాడ్‌ చేరుకుంటారు. అనంతరం గెస్ట్‌హౌస్‌కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు.


:- 24వ తేదీ శుక్రవారం ఉదయం 9.05 గంటలకు వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకుంటారు. 9.40 గంటల వరకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి ప్రార్థనల్లో పాల్గొంటారు. 9.55 గంటలకు ఇడుపులపాయలోని ప్రార్థనా మందిరానికి చేరుకుంటారు. 10 నుంచి 12 గంటల వరకు అక్కడ నిర్వహించే ప్రార్థనల్లో పాల్గొంటారు. 12.15 గంటలకు గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. 1.40 గంటలకు పులివెందుల పట్టణ పరిధిలోని ఇండస్ర్టియల్‌ పార్కుకు వెళతారు. 2.10 నుంచి 2.35 గంటల వరకు ఇండస్ర్టియల్‌ పార్కులోని ఆదిత్యా బిర్లా యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. 2.40 గంటలకు వైఎస్‌ఆర్‌ జగనన్న హౌసింగ్‌ కాలనీలో ఇళ్ల పట్టాల పంపిణీ, బహిరంగ సభలో లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడతారు. 3.35 గంటలకు మార్కెట్‌యార్డ్‌కు చేరుకొని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు.


- 3.55 నుంచి 4.05 గంటల వరకు మోడల్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 4.15 గంటలకు రాణితోపు సమీపంలో ఆక్వా హబ్‌ ప్రారంభిస్తారు. 5.05 గంటలకు ఇడుపులపాయ హెలీప్యాడ్‌లో పార్టీ నాయకులతో మాట్లాడతారు. 5.25 గంటలకు గెస్ట్‌హౌస్‌కు చేరుకొని రాత్రికి అక్కడే బసచేస్తారు.


:- 25వ తేదీ శనివారం ఉదయం 9.05 గంటలకు ఇడుపులపాయ హెలిప్యాడ్‌ నుంచి బయలుదేరి 9.25 గంటలకు పులివెందులకు చేరుకుంటారు. 9.45 నుంచి 11.05 గంటల వరకు సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్‌ ప్రార్థనల్లో పాల్గొంటారు. 11.15 గంటలకు సీఎస్‌ఐ చర్చి కాంపౌండ్‌లో ఏర్పాటు చేసిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. 11.25 గంటలకు విజయా గార్డెన్స్‌లో ఓ వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. 11.50 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భాకరాపురంలోని సొంత నివాసంలో గడుపుతారు. 1.35 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 1.40 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి వెళతారు.

Updated Date - 2021-12-23T13:19:39+05:30 IST