బల్క్ డ్రగ్స్ పరిశ్రమకు బొగ్గు సెగ
ABN , First Publish Date - 2022-05-15T08:01:21+05:30 IST
చైనా నుంచి ఏపీఐ లు, ఇంటర్మీడియెట్స్ తయారీలో వినియోగించే ముడి పదార్థాలు లభించక..
ముడి ఔషధాలూ లభించక ఇక్కట్లు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): చైనా నుంచి ఏపీఐ లు, ఇంటర్మీడియెట్స్ తయారీలో వినియోగించే ముడి పదార్థాలు లభించక ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న బల్క్డ్రగ్స్ పరిశ్రమ తాజాగా బొగ్గు కొరత, పెరిగిన ధరతో కష్టాలు ఎదుర్కొంటోంది. విద్యుదుత్పత్తికి ప్రాధాన్యం ఇచ్చి ఇతర పరిశ్రమలకు బొగ్గు సరఫరాను తగ్గించడంతో బల్క్డ్రగ్స్ పరిశ్రమ బొగ్గు కొరతను ఎదుర్కొంటోందని హైదరాబాద్కు చెందిన బల్క్డ్రగ్స్ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రభావం ఫార్ములేషన్ల తయారీ, ధరలపై కూడా ఉంటుందని అంటున్నారు.
బ్రాయిలర్లకు బొగ్గు అవసరం..
ప్రతి ఫార్మా కంపెనీలో స్ట్రీమ్ తయారీ కోసం బ్రాయిలర్లు ఉంటాయి. వీటికి బొగ్గు అవసరం ఉంటుంది. గత కొద్ది నెలల్లో బొగ్గు ధర దాదాపు 100 శాతం పెరిగింది. బొగ్గుతో పాటు కరెంట్లు చార్జీల పెంపు కూడా ఔషధ పరిశ్రమపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని హైదరాబాద్కు చెందిన ఫార్మా కంపెనీ అధిపతి ఒకరు తెలిపారు. చైనా నుంచి నుంచి బల్క్డ్రగ్స్ తయారీకి అవసరమైన ముడి ఔషధాలను ఇక్కడి తయారీదారులు దిగుమతి చేసుకుంటున్నారు. చైనాలో మళ్లీ లాక్డౌన్ పరిస్థితులు నెలకొనడంతో ముడి ఔషధాల సరఫరాకు అంతరాయం కలుగుతోంది. బల్క్డ్రగ్స్, ఔషధాలను తయారు చేసే చిన్న పరిశ్రమలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ముడి ఔషధాల ధరలు 400 శాతం వరకూ పెరిగాయి. పెరిగిన ధరలు చెల్లించడానికి సిద్ధమైనా.. ముడి ఔషధాలు లభించని పరిస్థితి ఉందని చెబుతున్నారు.
మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆ దేశాలకు ఔషదాలను సరఫరా చేస్తున్న కంపెనీలు అక్కడి నుంచి రావాల్సిన నగదు రాక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటే..
బొగ్గు సరఫరా కొరత కారణంగా కంపెనీలు ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటే కంపెనీల వ్యయాలు పెరుగుతాయి. ఈ ప్రభావం ఽవినియోగదారుడికి అందే ధరలపై ఉంటుంది. వ్యయాలు పెరిగితే చివరకు ఆ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయక తప్పదని అంటున్నారు.