స్వీయ నియంత్రణతోనే కొవిడ్‌ కట్టడి

ABN , First Publish Date - 2021-05-10T04:33:37+05:30 IST

ప్రజలంతా స్వీయనియంత్రణను పాటించటం ద్వారానే కొవిడ్‌ను నియంత్రించగల్గుతామని కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ పేర్కొన్నారు.

స్వీయ నియంత్రణతోనే కొవిడ్‌ కట్టడి
వైరా మునిసిపాలిటీ 15వ వార్డులో ఆరోగ్య జనగణను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న కలెక్టర్‌

 కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ 

  ఆరోగ్య జనగణను క్షేత్రస్థాయిలో పరిశీలన

వైరా/కొణిజర్ల, మే 9: ప్రజలంతా స్వీయనియంత్రణను పాటించటం ద్వారానే కొవిడ్‌ను నియంత్రించగల్గుతామని   కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌లు ధరించాలని, చేతులు శానిటైజ్‌ చేసుకోవడం, భౌతిక దూరం పాటించటం వలన కొవిడ్‌ ఉధృతిని నియంత్రించగల్గుతామని స్పష్టం చేశారు. వైరా మునిసిపాలిటీ 15వ వార్డు పరిధిలోని కొణిజర్ల మండలం దుద్దిపూడిలో ఆదివారం కలెక్టర్‌ కర్ణన్‌ ఆరోగ్య జనగణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దుద్దిపూడి ప్రాంతంలో ఆశకార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు నిర్వహిస్తున్న ఇంటింటి ఆరోగ్య సర్వే సమాచార సేకరణ ప్రక్రియను పరిశీలించారు. కొవిడ్‌ రెండోవేవ్‌లో అధికంగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించి మనోధైర్యం కల్పించాలని సూచించారు. ఇంట్లో ఉంటున్న కుటుంబసభ్యుల వివరాలు వారిలో సంపూర్ణ ఆరోగ్యవంతులు అలాగే జ్వరం, జలుబు, ఒంటినొప్పులు, నీరసం వంటి ఇతర సమస్యలతో బాధపడుతున్న వారి వివరాలను నమోదు చేయాలన్నారు. వారికి ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని తెలిపారు. ఆరోగ్య సర్వేలో కలెక్టర్‌ స్వయంగా పలు గృహాలకు చెందిన ప్రజలతో మాట్లాడి వారికి పలు జాగ్రత్తలు సూచించారు. పరిశుభ్రతను పాటిస్తూ మంచి పౌష్టికాహారం తీసుకోవాలని, జ్వరము, జలుబు, తలనొప్పి, ఒంటినొప్పులు, నీరసం వంటి సమస్యతో బాధపడుతున్న వారు సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి డాక్టర్‌ సలహా మేరకు మందులు వాడాలని స్పష్టం చేశారు. స్వల్ప లక్షణాలు కల్గినవారికి ఆశకార్యకర్తలు, అంగన్‌వాడీలు, ఏఎన్‌ఎంలు ఔషధాల కిట్లు అందిస్తారని తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నట్లయితే వెంటనే దగ్గరలోని పీహెచ్‌సీలకు కానీ, ఖమ్మం ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రికి గానీ తరలించాలన్నారు. జిల్లా యంత్రాంగం అన్నీ ముందస్తు ఏర్పాట్లతో వైద్య అధికారులు, సిబ్బందిని, ఔషదాలను సమకూర్చామని ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. కొవిడ్‌-19సేవలకు ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశామని ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. వైరా మునిసిపల్‌ కమిషనర్‌ ఎన్‌.వెంకటస్వామి, మునిసిపల్‌ ఏఈ అనిత పాల్గొన్నారు.

Updated Date - 2021-05-10T04:33:37+05:30 IST