సమన్వయంతో కొవిడ్‌ని అరికట్టాలి

ABN , First Publish Date - 2021-04-22T06:04:54+05:30 IST

కొవిడ్‌-19 నియంత్రణ, నివారణ చర్యలలో భాగంగా నియమించిన నోడల్‌ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తెలిపారు.

సమన్వయంతో కొవిడ్‌ని అరికట్టాలి
నోడల్‌ ఆఫీసర్లతో సమావేశమైన కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

104కి ఎవరైనా ఫోన్‌ చేస్తే వెంటనే ఆస్పత్రిలో చేర్చాలి

హోం ఐసోలేషన్‌లో వారిని ఏఎన్‌ఎంలు పర్యవేక్షించాలి

కల్యాణ మండపాలను కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లుగా చేయాలి

తాత్కాలిక సిబ్బందికి నియామక ఉత్తర్వులకు ఆదేశాలు

నోడల్‌ అధికారుల సమావేశంలో కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

గుంటూరు, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 నియంత్రణ, నివారణ చర్యలలో భాగంగా నియమించిన నోడల్‌ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో నోడల్‌ ఆఫీసర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో తొలి విడత కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు విధులు నిర్వహించిన విధంగానే సెకండ్‌వేవ్‌ నియంత్రణకు మరింత బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. వైరస్‌ సోకిన వ్యక్తులు ఎవరైనా కాల్‌ సెంటర్‌ 104కి ఫోన్‌ చేసిన వెంటనే వారిని ఆస్పత్రుల్లో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. చికిత్సకు జిల్లాలో ఇప్పటివరకు 60 ఆస్పత్రులను సిద్ధం చేశామన్నారు. ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో నిర్వహించే నెట్‌వర్కు ఆస్పత్రులు, కొవిడ్‌ చికిత్సకు అనుమతించిన ప్రైవేటు ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్‌లు కరోనా చికిత్సకే కేటాయించే విధంగా నోడల్‌ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న రోగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఏఎన్‌ఎంల ద్వారా పర్యవేక్షించాలని సూచించారు. శాంపిల్‌ సేకరించిన మూడు గంటల లోపు టెస్టింగ్‌ ల్యాబ్‌లకు అందేవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కొవిడ్‌ రోగులకు చికిత్స అందించేందుకు గత ఏడాది నియమించిన సిబ్బంది అందరికీ నియామక ఉత్తర్వులు వెంటనే పంపి వారు విధులలో చేరే విధంగా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వోని ఆదేశించారు.   కల్యాణ మండపాలను గుర్తించి వాటిని కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా వినియోగించేందుకు సిద్ధం చేయాలన్నారు. ప్రతీ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో కనీసం 500 పడకలు ఉండాలన్నారు. కొవిడ్‌ ప్రభావిత ప్రాంతాలను మినీ కంటైన్మెంట్‌ జోన్లుగా చేసి అక్కడ ఎరుపు రంగు జెండాని ఒక గుర్తింపుగా పెట్టాలన్నారు. సమావేశంలో జేసీలు పీ ప్రశాంతి, కే శ్రీధర్‌రెడ్డి, తెనాలి, నరసరావుపేట సబ్‌ కలెక్టర్లు మయూర్‌ అశోక్‌, శ్రీవాస్‌ నుపుర్‌ అజయ్‌ఖుమార్‌, ట్రైనీ కలెక్టర్‌ శుభం బన్సల్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జే యాస్మిన్‌, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఆనంద్‌నాయక్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-22T06:04:54+05:30 IST