మీటర్ల ఏర్పాటులో తగ్గేదేల్యా..!
ABN , First Publish Date - 2022-06-30T06:57:59+05:30 IST
జిల్లాల విభజన జరిగినప్పటికీ ఎస్పీడీసీఎల్ అంతా పాత వైఎస్సార్ కడప జిల్లా పరిధిలో ఉంది. జిల్లాలో 1,74,702 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటికీ కేంద్ర మార్గదర్శకాల ప్రకారం మోటార్లు బిగించాల్సి ఉంది. దీనికి సంబంధించి విద్యుత్ అధికారులు రైతుల నుంచి ఆఽధార్, బ్యాంక్ ఖాతాలను సేకరిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఏఈ, లైన్మెన్
రైతుల నుంచి బ్యాంకు ఖాతాల సేకరణ
రైతుల ఖాతాల్లో బిల్లుల నగదు జమ చేస్తామంటున్న ప్రభుత్వం
ఖాతాలు ఇచ్చేందుకు మొగ్గు చూపని రైతులు
ఇలాగైతే సాగు భారం అంటున్న అన్నదాతలు
రైతులు వద్దంటున్నా కూడా వ్యవసాయ మీటర్ల ఏర్పాటును ప్రభుత్వం తగ్గేదేల్యా అన్నట్టు ముమ్మరం చేస్తోంది. కేంద్రం షరతులకు తలొగ్గిన జగన్.. తండ్రి వైఎ్సఆర్ ఇచ్చిన ఉచిత విద్యుత్కే ఎగనామం పెడుతున్నారంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు వాడే కరెంట్ డబ్బులు ప్రభుత్వమే రైతు ఖాతాలో వేస్తుంది. ఆ సొమ్ము ఎస్పీడీసీఎల్ తీసుకుంటుందని మీరు ఒక్క పైసా కట్టనవసరం లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రైతులు నమ్మడం లేదు. ప్రభుత్వం ఆ డబ్బులేవో ఇప్పుడు మాదిరిగా నేరుగా విద్యుత్ సంస్థల ఖాతాలోకే జమ చేస్తే సరిపోతుంది కదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం రైతు ఖాతాల్లో సక్రమంగా బిల్లులు జమ చేయకపోతే అధికారులు కరెంట్ కట్ చేస్తారు. లేదంటే తమ ఖాతాల్లో దాచుకున్న డబ్బు ఎక్కడ డ్రా చేసుకుంటారో అన్న భయం రైతుల్లో ఉంది.
(కడప - ఆంధ్రజ్యోతి) : జిల్లాల విభజన జరిగినప్పటికీ ఎస్పీడీసీఎల్ అంతా పాత వైఎస్సార్ కడప జిల్లా పరిధిలో ఉంది. జిల్లాలో 1,74,702 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటికీ కేంద్ర మార్గదర్శకాల ప్రకారం మోటార్లు బిగించాల్సి ఉంది. దీనికి సంబంధించి విద్యుత్ అధికారులు రైతుల నుంచి ఆఽధార్, బ్యాంక్ ఖాతాలను సేకరిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఏఈ, లైన్మెన్ పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటు మోటార్కు మీటర్ ఏర్పాటు చేసేందుకు సమ్మతమేనంటూ పత్రాల మీద రైతు సంతకం చేయాల్సి ఉంది. మోటార్లకు మీటర్ల ఏర్పాటును టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇటీవల మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించడంతో పాటు ఇతర రైతు అంశాలపై టీడీపీ బద్వేలులో రాయలసీమ స్థాయి రైతు పోరుబాట నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు. ఇక రైతు సంఘాలు సైతం మీటర్ల ఏర్పాటును వ్యతిరేకి స్తున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఏ మాత్రం తగ్గకుండా మొండిగా ముందుకెళుతోందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల నుంచి పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్, రెవెన్యూ నుంచి నిరభ్యంతర పత్రం, అంగీకార పత్రాన్ని అధికారులు తీసుకుంటున్నారు. బ్యాంకు ఖాతా తీసుకుంటుండడంతో ప్రభుత్వం డబ్బులు చెల్లించడంలో ఆలస్యమైతే తినో తినకో కుటుంబ అవసరాల కోసం కూడబెట్టుకున్న తమ సొమ్మును ఎక్కడ లాగేసుకుంటారో అన్న భయం రైతులను వెంటాడుతోంది. దివంగ త సీఎం వైఎ్సఆర్ 2004 నుంచి ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నారు. ఆయన తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉచిత విద్యుత్ను కొనసాగిస్తూ వచ్చారు. అయితే తండ్రి ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా తనయుడు జగన్ కేంద్ర ఆదేశాలకు తలొగ్గి ఉచిత విద్యుత్కు మంగళం పాడేలా వ్యవహరిస్తున్నారంటూ రైతులు మండిపడుతున్నారు.
ససేమిరా అంటున్న రైతులు
శ్రీకాకుళం జిల్లాలో మోటార్లకు మీటర్ల ఏర్పాటును ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఈనెల చివరి నాటికి రైతుల నుంచి బ్యాంకు ఖాతా, హామీ పత్రంతో పాటు ఇతర వివరాలు సేకరించాలని జిల్లాలో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,74,702 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉంటే కేవలం 30 వేల మంది రైతులకు సంబంఽధించిన వివరాలు మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. చాలా మంది రైతులు భయంతో ఖాతా వివరాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.
డివిజన్ల వారీగా విద్యుత్ కనెక్షన్లు...
=================
డివిజన్ కనెక్షన్లు
=================
కడప 10427
పులివెందుల 27556
ప్రొద్దుటూరు 22416
మైదుకూరు 42840
రాజంపేట 41177
రాయచోటి 30292