ఆధునిక వ్యవసాయంతో అవగాహన కల్పించాలి
ABN , First Publish Date - 2020-08-07T11:19:45+05:30 IST
రైతులకు వినూత్నమైన సాగు పద్ధతులు, ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించి తద్వారా అధిక ..
రైతులకు సకాలంలో రుణాలివ్వండి
కలెక్టర్ చక్రధర్బాబు
నెల్లూరు(వ్యవసాయం), ఆగస్టు 6 : రైతులకు వినూత్నమైన సాగు పద్ధతులు, ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించి తద్వారా అధిక ఆదాయం పొందేలా చూడాలని కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలు, లీడ్ బ్యాంకు అధికారులతో ఆయన గురువారం సమీక్షించారు. అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు, తక్కువ నీటితో పండించే పంటల ఎంపిక, నూతన సాగు విధానం, యంత్ర పరికరాల వినియోగం వంటి వాటి ద్వారా లక్ష్య సాధనకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
కరోనా విపత్కర పరిస్థితుల్లో జిల్లా రైతాంగానికి ఎలాంటి నష్టం కలుగకుండా గతేడాదికన్నా మిన్నగా అధిక ఆదాయం పొందేలా కృషి చేయాలన్నారు. రైతులకు సకాలంలో రుణాలు అందించాలని ఆదేశించారు. ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచాలని సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ ఇన్చార్జి జేడీ జీ శివన్నారాయణ, సహాయ ఉద్యాన సంచాకులు ప్రదీప్, కలీం, లీడ్ బ్యాంకు డిస్ట్రిక్ట్ మేనేజరు రామప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.