ఇళ్ల నిర్మాణాల్లో జాప్యంపై కలెక్టర్‌ అసంతృప్తి

ABN , First Publish Date - 2022-06-30T06:26:36+05:30 IST

అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి బుధవారం మండలంలోని వడ్డాది, ఆర్‌.భీమవరం, ఆర్‌.శివరామపురం, కందిపూడి, బుచ్చెయ్యపేట, దిబ్బిడి, విజయరామరాజుపేట, మంగళాపురం గ్రామాల్లో పర్యటించారు.

ఇళ్ల నిర్మాణాల్లో జాప్యంపై కలెక్టర్‌ అసంతృప్తి
ఇళ్ల నిర్మాణాలపై అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి

పనులు వేగవంతం చేయాలని ఆదేశం

బిల్లులు మంజూరు కాకపోవడమే కారణమని అధికారులు వివరణ

బుచ్చెయ్యపేట, జూన్‌ 29: అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి బుధవారం మండలంలోని వడ్డాది, ఆర్‌.భీమవరం, ఆర్‌.శివరామపురం, కందిపూడి, బుచ్చెయ్యపేట, దిబ్బిడి, విజయరామరాజుపేట, మంగళాపురం  గ్రామాల్లో పర్యటించారు. సచివాలయాలను తనిఖీ చేసి సిబ్బంది పనితీరును పరిశీలించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు మందకొడిగా సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మెటీరియల్‌ ఇచ్చినప్పటికీ నిర్మాణ పనులు ఎందుకు వేగవంతం కాలేదని కలెక్టర్‌ ప్రశ్నించగా... ఇంతవరకు పూర్తి చేసిన పనులకు సంబంధించి బిల్లులు అందకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు వివరించారు. వడ్డాది లేఅవుట్‌లో పూర్తిస్థాయిలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో పంచాయతీ ప్రత్యేకాధికారి అయిన తహసీల్దార్‌ ఉమా మహేశ్వరరావును ఆయనఅభినందించారు. అమృత్‌ సరోవర్‌ పథకం కింద కందిపూడిలో రూ.24 లక్షలతో చేపడుతున్న చెరువు అభివృద్ధి పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ పథకం కింద మండలంలో ఎన్ని చెరువులను అభివృద్ధి చేసున్నారని ప్రశ్నించగా, నాలుగు చెరువులని ఎంపీడీఓ విజయలక్ష్మి తెలిపారు. దిబ్బిడిలో 104 అంబులెన్స్‌ సేవలను పరిశీలించారు. ముఖ్యమైన కేసులను ఎక్కడికి పంపిస్తారని ప్రశ్నించగా, పీహెచ్‌సీలకు రిఫర్‌ చేస్తామని వైద్య సిబ్బంది తెలిపారు. 

వడ్డాది జంక్షన్‌లో రోడ్డుకి ఎడమ పక్కన సీసీ డ్రైనేజీ కాలువ నిర్మాణంతోపాటు కుడి వైపు, డబ్ల్యూపీ రోడ్డులో తుమ్మలాడ కాలువవైపు కూడా సీసీ డ్రైనేజీ కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వైసీపీ వడ్డాది అధ్యక్షుడు దొండా నారాయణమూర్తి, వార్డు మెంబరు గుమ్ముడు ప్రసాద్‌ కోరగా, ఉపాధి హమీ పథక కింద అంచనాలు తయారు చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఆర్డీఓ చిన్నికృష్ణ, హౌసింగ్‌ డీఈఈ వెంకటేశ్వరరావు, ఏఈఈ గోపీనాథ్‌, మండల ఇంజనీర్‌ ఆనందరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ హరీశ్‌ ఉపాధి పథకం ఏపీఓ మురళీ, ఈఓపీఆర్‌డీ నారాయణరావు, ఆర్‌ఐ శ్రీనివాస్‌, వీఆర్వోలు, తదితరలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-30T06:26:36+05:30 IST