కరోనా నియంత్రణకు సమర్థంగా పనిచేయాలి
ABN , First Publish Date - 2021-04-21T04:29:17+05:30 IST
జిల్లాలో వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ను అరికట్టేందుకు సమర్థవంతంగా పనిచేయాలని కలెక్టర్ చక్రధర్బాబు అధికారులను ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్
నెల్లూరు(హరనాథపురం), ఏప్రిల్ 20 : జిల్లాలో వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ను అరికట్టేందుకు సమర్థవంతంగా పనిచేయాలని కలెక్టర్ చక్రధర్బాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం తిక్కన భవన్ నుంచి జిల్లాలోని ఆర్డీవోలు, మండల ప్రత్యేకాధికారులు, మున్సిపల్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతేడాది కొవిడ్ను జిల్లా యంత్రాంగం సమర్థంగా ఎదుర్కొందన్నారు. ఆదే స్ఫూర్తితో రెండో దశ కొవిడ్నూ సంపూర్ణంగా నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు ప్రణాళికాబద్దంగా చేపట్టాలని సూచించారు. కొవిడ్ కేర్ సెంటర్లు, వైద్యశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులు, మందుల నిల్వ ఉండేలా చూడాలన్నారు. సచివాలయాన్ని యూనిట్గా తీసుకుని కమిటీలను ఏర్పాటు చేసి కొవిడ్ నియంత్రణకు కృషి చేయాలన్నారు. 104, 1077 కాల్ సెంటర్లను ఏర్పాటు చేశామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలోని ఫ్రంట్ లైన్ వర్కర్లందరికీ నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 3.56 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. మే 1 నుంచి 18 సంవత్సరాలు నిండిన వారందరికీ వ్యాక్సిన్ వేస్తారన్నారు. నెల్లూరు కార్పొరేషన్తోపాటు ఇతర మున్సిపాలిటీల్లో కొవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్న దృష్ణ్యా మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. స్విమ్మింగ్పూల్స్ను మూసేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా అవగాహన కల్పించాలని, మాస్క్ ధరించని వారికి ఫైన్ వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జేసీలు హరేందిరప్రసాద్, ప్రభాకర్రెడ్డి, అదనపు ఎస్పీ వెంకటరత్నం, డీఎఫ్వో షణ్ముఖకుమార్, డీఆర్వో చిన్నఓబులేసు తదితరులు పాల్గొన్నారు.