‘విధుల్లో అలసత్వం వద్దు’

ABN , First Publish Date - 2022-05-28T06:51:39+05:30 IST

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని, విధుల్లో అలసత్వం వద్దని కలెక్టరు మనజీర్‌ జీలానీ సామూన్‌ అన్నారు.

‘విధుల్లో అలసత్వం వద్దు’
సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌

ఆళ్లగడ్డ, మే 27: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని, విధుల్లో అలసత్వం వద్దని కలెక్టరు మనజీర్‌ జీలానీ సామూన్‌ అన్నారు. పట్టణంలోని తహాసీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆళ్లగడ్డ మండలంలోని స్పందన అర్జీలు ఎక్కువ ఉన్నాయని, వాటిని త్వరగా పరిష్కరించాలని తహసీల్దార్‌ రమేష్‌రెడ్డిని ఆదేశించారు. వ్యవసాయాధికారులు ఎరువులు, క్రిమిసంహారక దుకాణాలను తనిఖీ చేసి నివేదిక పంపాలన్నారు. గ్రామాల్లోని ఆర్బీకేల్లో రైతులకు సూచనలు, సలహాలు, ఎరువులు వంటి వాటి సమాచారాన్ని ఇవ్వాలన్నారు. గ్రామాల్లో అతిసార బారిన పడకుండా ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని అన్నారు. జి.జంబులది న్నెలో మాదిరి గ్రామాల్లో అతిసార ప్రబలితే మండలస్థాయి అధికారులను సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే గుడ్లు, తదితర ఆహార పదార్థాలను బాగున్నాయో లేదో పరిశీలించి పంపిణీ చేయాలని ఐసీడీఎస్‌ అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ఐసీడీఎస్‌ అధికారులు మంచి నీటి సరఫరా చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. గ్రామాల్లోని పశువులకు మొబైల్‌ పశువైద్య వాహనాల ద్వారా సత్వర చికిత్స చేసి పశువుల మరణాలు తగ్గించి, పశు సంపద అభివృద్ధికి వెటర్నరీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలో ఎన్ని పాఠశాలలున్నాయి, ఎంత మంది పిల్లలున్నారు, నాడు-నేడు కింద ఎన్ని పాఠశాలలు పూర్తి చేశారు వంటి వివరాలను ఎంఈవో శోభావివేకవతిని అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్‌ రమేష్‌రెడ్డి, ఎంపీడీవో సుబ్బారెడ్డి, హౌసింగ్‌ ఏఈ ప్రతాపరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ నాయక్‌, ఏవో కిశోర్‌కుమార్‌రెడ్డి, ఐసీడీఎస్‌ అధికారి జ్యోత్స్న, ఎంఈవో శోభావివేకవతి పాల్గొన్నారు.


మండలంలోని జి.జంబులదిన్నె గ్రామంలో జగనన్న కాలనీని, సచివాలయాన్ని, అలాగే ఆళ్లగడ్డలోని సచివాలయాన్ని పరిశీలించారు.


Updated Date - 2022-05-28T06:51:39+05:30 IST