హిజాబ్ వివాదం.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-02-10T23:23:31+05:30 IST

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలోని

హిజాబ్ వివాదం.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలోని కళాశాలలను తెరుచుకోవచ్చని పేర్కొంది. అయితే, ఈ సమస్య పరిష్కారమయేంత వరకు విద్యార్థులు తమ మతాచారాలను ప్రతిబింబించేలా ఎలాంటి దుస్తులు ధరించరాదని స్పష్టం చేసింది. 


కళాశాల విద్యార్థులు హిజాబ్ ధరించడంపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు నేడు విచారించింది. పిటిషన్‌ను విచారించిన త్రిసభ్య ధర్మాసనం.. సమస్య పెండింగులో ఉన్నంత కాలం విద్యార్థులు మతపరమైన ఎలాంటి దుస్తులు ధరించరాదని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 


విచారణను వాయిదా వేయడానికి ముందు చీఫ్ జస్టిస్ రితు రాజ్ అవస్థి మాట్లాడుతూ.. ఈ సమస్య కోర్టులో పెండింగులో ఉన్నంత వరకు విద్యార్థులెవరూ తమ మతాచారాలకు అనుగుణంగా దుస్తులు ధరించరాదని స్పష్టం చేశారు. కాగా, ఈ పిటిషన్‌పై విచారణ కోసం కోర్టు నిన్న చీఫ్ జస్టిస్ రితురాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జైబున్నీసా ఎం ఖాజీలతో త్రిసభ్య బెంచ్‌ను ఏర్పాటు చేసింది.

 

కర్ణాటకలో హిజాబ్ వివాదం గతేడాది డిసెంబరులో మొదటిసారి వెలుగుచూసింది. ఉడుపిలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థినులు హిజాబ్ ధరించి వచ్చారు. దీనికి నిరసనగా కొందరు విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి కళాశాలకు వచ్చారు. రెండు రోజుల క్రితం ఈ గొడవ మరింత ముదిరి హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం మూడు రోజులపాటు విద్యాసంస్థలకు మూడు రోజులపాటు సెలవులు ప్రకటించింది. 


Updated Date - 2022-02-10T23:23:31+05:30 IST