పారిశ్రామికవేత్తలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్
ABN , First Publish Date - 2021-06-18T05:18:38+05:30 IST
వైద్యరంగానికి అనుబంధమైన పరిశ్రమలు, యూనిట్ల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కలెక్టర్ వీర పాండియన్ పిలుపునిచ్చారు.
కర్నూలు(కలెక్టరేట్), జూన్ 17: వైద్యరంగానికి అనుబంధమైన పరిశ్రమలు, యూనిట్ల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కలెక్టర్ వీర పాండియన్ పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం నుంచి జీఎండీఐసీ, ఇండస్ట్రియల్ అసోసియేషన్ సంబంధిత అధికారులతో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ (డీఐఈపీసీ) సమావేశాన్ని ఆయన వర్చువల్ ద్వారా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధానంగా నంద్యాల, ఆదోనిలో మెడికల్ కాలేజీతో కలుపుకుంటే మూడు టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నట్లు అని, ఈ నేపథ్యంలో హాస్పిటల్కు సంబంధించిన అనుబంధ పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం పథకంపై లబ్ధిదారులు బ్యాంకర్లతో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఈ పథకంతో పాటు అన్ని పథకాల గురించి అవగాహన కల్పించి, తద్వారా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ను కలెక్టర్ ఆదేశించారు. అనుమతులకు సంబంధించి సింగిల్ డెస్క్, పోర్టల్లో 260 దరఖాస్తులు రాగా, అందులో 243 దరఖాస్తులు నిర్దేశించిన గడువులోగా ఆమోదించినట్లు తెలిపారు. 9 దరఖాస్తులు పురోగతిలో ఉన్నాయని, 8 అప్లికేషన్లు తిరస్కరించినట్లు తెలిపారు. ఏ కారణంతో వాటిని తిరస్కరించారో ఆ వివరాలను దరఖాస్తుదారులకు తెలియజేయాలని జీఎండీఐసీని ఆదేశించారు. సులభతర వాణిజ్య విధానంలో భాగంగా పరిశ్రమలు నెలకొల్పేందుకు ఫైర్, పొల్యూషన్, పంచాయతీ, మున్సిపాలిటీ, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ తదితర శాఖల పరిధిలో నిర్ణీత కాలవ్యవధిలోపు అనుమతులు ఇవ్వాలని అధికారులను కలెక్టర్ ఆదేశిపంచారు. సేవా రంగంలో ఉన్నటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పంచాయతీ కార్యదర్శుల సంప్రదించినప్పుడు ట్రేడ్ లైసెన్సులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని పంచాయతీ అధికారిని ఆదేశించారు. వైఎస్సార్ జగనన్న బడుగు వికాసంపై కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, నైపుణ్య అభివృద్ధి సంస్థలు, బ్యాంకర్లు లబ్దిదారులకు పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహించాలని జిల్లా పరిశ్రమల శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ, పవర్ టారీఫ్, జీఎస్టీ మొత్తం 167 క్లెయిమ్స్కు రూ.6,03,32,982 సబ్సిడీ మొత్తం మంజూరుకు నిర్ణయం తీసుకుందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్లు, జీఎండీఐసీ సోమశేఖర్ రెడ్డి, నాబార్డు డీడీఎం పార్థసారఽథి, ఎల్డీఎం వెంకటనారాయణ, జడ్ఎం ఏపీఐఐసీ వెంకట నారాయణమ్మ, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ డీఐసీ చందర్, కుడా వీసీ, డీసీఎస్టీ సత్యప్రకాష్, డిక్కి ప్రెసిడెంట్ రాజమహేంద్రనాథ్, ప్రెసిడెంట్ చాంబర్ ఆఫ్ కామర్స్ విజయ్ కుమార్ రెడ్డి, ఇండస్ట్రియల్ అసోసియేషన్ జయన్న, తదితర అధికారులు పాల్గొన్నారు.