‘భారత్ జోడో యాత్ర’తో అధికారంలోకి రావడం ఖాయం
ABN , First Publish Date - 2022-10-08T04:39:10+05:30 IST
ఏఐసీసీ నేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ద్వారా కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ సభ్యుడు గంప మహేందర్, ఎస్సీ సెల్ సిద్దిపేట జిల్లా చైర్మన్ బొమ్మల యాదగిరి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ అన్నారు.
సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు
సిద్దిపేట టౌన్, అక్టోబరు 7: ఏఐసీసీ నేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ద్వారా కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ సభ్యుడు గంప మహేందర్, ఎస్సీ సెల్ సిద్దిపేట జిల్లా చైర్మన్ బొమ్మల యాదగిరి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని మోడ్రన్ బస్టాండ్ వద్ద ఏఐసీసీ నాయకురాలు సోనియాగాంధీ, భారత్ జోడో యాత్రలో పాల్గొన్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ రాహుల్గాంధీ చిత్రపటానికి ఆ పార్టీ నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకు అన్న చందంగా రాహుల్గాంధీ తన తల్లి సోనియాగాంధీకి యాత్రలో భాగంగా షూ లేసులు బిగించడంపై ఆయన ప్రవర్తించిన తీరు అభినందనీయమన్నారు. కన్నతల్లి ఉన్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారిని పట్టించుకోకుండా, దూరంగా ఉంచారన్నారు. పుట్టిన తల్లికి సేవ చేయలేని మోదీ, దేశానికి ఇంకేమీ సేవ చేస్తారని ప్రశ్నించారు. కేంద్రంలో పథకాల పేరిట ఆదాని, అంబానీలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. భారత్ జోడోయాత్ర పేరిట పర్యటిస్తున్న రాహుల్గాంధీకి విశేష ప్రజాదరణ వస్తుందని, యాత్రలో పాల్గొంటున్న రాహుల్ వెంటే ప్రజలు స్వచ్ఛందంగా నడుస్తున్నారని తెలిపారు. రాహుల్గాంధీని స్ఫూర్తిగా తీసుకొని రేవంత్రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అందుకు నాయకులు, కార్యకర్తలు సమష్ఠి కృషి, కార్యాచరణతో ముందుకెళ్తామని, దానిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకున్న తీరును, వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి గడపగడపకు తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చొప్పదండి చంద్రశేఖర్, పూజల గోపికృష్ణ, కలిముద్దీన్, అబ్దుల్ వహాబ్, అజ్మత్, అంజయ్య, గ్యాదరి మధు, మున్నా పాల్గొన్నారు.