నియోజకవర్గంలో ప్రతి పనికీ ఎమ్మెల్యే ధర్మశ్రీకి కమీషన్‌!

ABN , First Publish Date - 2022-05-24T06:44:21+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో అవినీతి పెచ్చురిల్లిపోయిందని సీపీఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ ధ్వజమెత్తారు.

నియోజకవర్గంలో ప్రతి పనికీ ఎమ్మెల్యే ధర్మశ్రీకి కమీషన్‌!
సమావేశంలో మాట్లాడుతున్న బాలేపల్లి వెంకటరమణ

వైసీపీ పాలనలో చోడవరంలో అవినీతి పెచ్చరిల్లింది

సీపీఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ ఆరోపణ


చోడవరం, మే 23 : వైసీపీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో అవినీతి పెచ్చురిల్లిపోయిందని సీపీఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ ధ్వజమెత్తారు. పార్టీ జిల్లా సమితి సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడ ఏర్పాటైన నాలుగో మండల పార్టీ మహాసభలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రతి పనికి కమీషన్‌ లేనిదే చేయడం లేదని ఆరోపించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు లేకుండా పనులు జరగని పరిస్థితి నెలకొందన్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే స్థానిక ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకపోవడమే మంచిదిగా కనిపిస్తుందన్నారు. లేనిపక్షంలో నియోజకవర్గం నాశనమయ్యే పరిస్థితి ఉండేదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా నియోజకవర్గ ఎమ్మెల్యే చిత్తశుద్ధతో ప్రజా సమస్యలపై వ్యవహరించాలని,. లేకుంటే ప్రజలు తిరగబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అనంతరం పార్టీ మండల కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల శాఖ కార్యదర్శిగా నేమాల హరి, సహాయ కార్యదర్శిగా పొట్నూరు మరిడిలతో పాటు 12మంది సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు కిళ్లి లక్ష్మయ్య, విస్సారపు నాగు, గోవాడ కనకమహాలక్ష్మి, నేమాల నరసింగరావు, రావాడ వరహాలు, సీత, పొట్నూరి మరిడయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-24T06:44:21+05:30 IST