రూపాయి పతనం కాలేదు
ABN , First Publish Date - 2022-08-03T09:24:40+05:30 IST
డాలర్తో పోల్చితే రూపాయి విలువ పతనమైపోతోందన్న ఆందోళనలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.
అమెరికన్ డాలర్తో పోల్చితే అలా కనిపిస్తోంది.. అంతే : నిర్మల
న్యూఢిల్లీ, ఆగస్టు 2: డాలర్తో పోల్చితే రూపాయి విలువ పతనమైపోతోందన్న ఆందోళనలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. మన రూపాయి విలువ పడిపోలేదని నొక్కి చెప్పారు. మంగళవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో అదనపు ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ‘అమెరికన్ డాలర్తో పోల్చితే మన రూపాయి హెచ్చుతగ్గులకు గురవుతున్నట్టు కనిపిస్తోంది. కానీ, ఇతర దేశాల కరెన్సీలతో పోల్చితే మన రూపాయి చాలా మెరుగ్గానే ఉంది. మన కరెన్సీని ఆర్బీఐ నిరంతరం పరిశీలిస్తోంది. అస్థిరత ఏర్పడినప్పుడు జోక్యం చేసుకుంటోంది. రూపాయిని బలోపేతం చేసేందుకు ఆర్బీఐ, ఆర్థిక శాఖ కృషి చేస్తున్నాయి’ అని నిర్మల తెలిపారు. విదేశీ మారకం నిల్వలు తరిగిపోతుండటంపై మాట్లాడుతూ ‘గతనెల 22వ తేదీ నాటికి 571 బిలియన్ల అమెరికన్ డాలర్ల వరకు నిల్వలు ఉన్నాయి. ఇదేమీ చిన్న మొత్తం కాదు. భారత్ ఇప్పటికీ సురక్షిత స్థానంలో ఉంది. ఇది కరోనా నుంచి కోలుకుంటున్న సమయం. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ భారత కరెన్సీ పటిష్ఠంగా ఉంది. ఈ అమృత కాలాన్ని గుర్తుపెట్టుకోండి’ అని ప్రతిపక్షాలకు నిర్మల సూచించారు. ఎన్ఆర్ఐలను విదేశీ కరెన్సీలో చెల్లింపులకు అనుమతించాలనే సూచనపై నిర్మల స్పందిస్తూ, ఈ సూచనను ఆర్బీఐకి పంపిస్తామన్నారు. సందేహాస్పద, నకిలీ లోన్ యాప్లపై చర్యలు తీసుకుంటున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. గత రెండు నెలల నుంచి తెలంగాణలో లోన్ యాప్ వేధింపులు పెరిగిపోయినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై చర్యలకు ఆదే శించినట్టు తెలిపారు. ఒక్క ఆ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఎక్కడ జరిగినా.. చర్యలు తీసుకుంటామని వివరించారు. కాగా, జనాభా గణన అంశాన్ని ఉమ్మడి జాబితాలోకి తెచ్చే యోచన లేదని.. కేంద్రం స్పష్టం చేసింది.