తెలంగాణ ఆత్మగౌరవానికి, అధికార దాహానికి మధ్య పోటీ
ABN , First Publish Date - 2020-10-27T11:48:05+05:30 IST
దుబ్బాకలో జరుగుతున్న ఉపఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవానికి, అధికార దాహానికి మధ్య జరుగుతున్న పోటీ అని మాజీమంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు పేర్కొన్నారు.
ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం విఫలం : మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తా
కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్రెడ్డి
రాయపోల్, అక్టోబరు 26 : దుబ్బాకలో జరుగుతున్న ఉపఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవానికి, అధికార దాహానికి మధ్య జరుగుతున్న పోటీ అని మాజీమంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు పేర్కొన్నారు. సోమవారం రాయపోల్ మండలంలోని పలుగ్రామాల్లో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివా్సరెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడారు. గొర్రెలు, బర్రెలు ఇవ్వడాన్ని తాము తప్పుపట్టడం లేదని, యువకులకు ఉద్యోగ కల్పనలో మాత్రం ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇంజనీరింగ్, పీజీలు చదవిన యువకులు గొర్రెలు, బర్రెలు కాయాలా? ఆయన ప్రశ్నించారు. అనంతరం ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎంత మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కుటుంబంలో మాత్రం నలుగురికి ఉద్యోగాలు లభించాయని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు కల్పించకపోగా కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడంలేదని ఆరోపించారు. అధిక వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివా్సరెడ్డి మాట్లాడుతూ తాను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని హామీనిచ్చారు. తనను గెలిపిస్తే ప్రజల పక్షాన నిలబడి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
నా బిడ్డను ఆశీర్వదించండి : చెరుకు విజయలక్ష్మి
తొగుట : దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీచేస్తున్న చెరుకు శ్రీనివా్సరెడ్డిని ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని చెరుకు విజయలక్ష్మి ఓటర్లను అభ్యరించారు. తొగుట మండలం వెంకట్రావుపేటలో ఆమె సోమవారం రాత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది దివంగత ముత్యంరెడ్డి హయాంలోనే అని ఆమె గుర్తుచేశారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గాన్ని అన్నింటిలో ముందంజలో నిలిపేందుకు ఆయన వారసుడు ముందుకొచ్చాడన్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. ఆమె వెంట నాయకులు గొడుగు దామోదర్, తిరుపతి, సురే్షరెడ్డి, శ్రీధర్రెడ్డి, అనిల్, కొండల్ రెడ్డి, సంధ్య, స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు.