పోటాపోటీగా
ABN , First Publish Date - 2022-07-02T05:43:33+05:30 IST
డాక్టర్ పీవీజీ రాజు చింతలవలస క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న టీ-20 మహిళా క్రికెట్ మాచ్ల్లో క్రీడాకారులు మెరుపుషాట్లతో ఆకట్టుకుంటున్నారు.
నేడు సెమీ ఫైనల్స్
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)/డెంకాడ:
డాక్టర్ పీవీజీ రాజు చింతలవలస క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న టీ-20 మహిళా క్రికెట్ మాచ్ల్లో క్రీడాకారులు మెరుపుషాట్లతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా శుక్రవారం జరిగిన పోటీలు ఉత్సాహంగా ఉత్కంఠగా సాగాయి. ఉదయం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన విజయనగరం రాయల్స్ ఫీల్డింగ్ను ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన రాయలసీమ క్వీన్స్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేశారు. ఎమ్.దర్గ 70 బాంతుల్లో 70 పరుగులు చేశారు. ఏడు ఫోర్లు కొట్టారు. విజయనగరం రాయల్స్ బ్యాటింగ్లో 19.5 ఓవర్లలో నిర్ణీత లక్ష్యాన్ని అధిగమించి 149 పరుగులు చేశారు. ఆరు వికెట్లు కోల్పోయారు. ఈ.పద్మజ 43 బంతుల్లో 64 పరుగులు చేసి రన్ రేట్ను పరుగు పెట్టించారు. ఏడు ఫోర్లు, రెండు సిక్సులు కొట్టారు. ప్లేయర్ఆఫ్ది మ్యాచ్ను దక్కించుకున్నారు. మధ్యాహ్నం బెజవాడ బ్లేజర్స్-వైజాగ్ డాల్ఫిన్స్ జట్లు తలపడ్డాయి. బెజవాడ బ్లేజర్స్ బ్యాటింగ్ చేపట్టి నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేశారు. తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన వైజాగ్ డాల్ఫిన్స్ 6.3 ఓవర్లలో ఒక వికెట్టు కోల్పోయి 56 పరుగులు చేశారు. వర్షం కారణంగా మ్యాచ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. అప్పటివరకు సాధించిన పాయింట్లను లెక్కకట్టారు. ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా వైజాగ్ డాల్ఫిన్స్ జట్టు ఎన్.అనూష దక్కించుకున్నారు. శనివారం కూడా మ్యాచ్లు కొనసాగనున్నాయి. ఈనెల 3న ఆదివారం ఫైనల్స్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్కు ఎవరు చేరేది శనివారం తేలనుంది.