వైసీపీ ఇన్చార్జి అశోక్బాబుపై ఫిర్యాదులు
ABN , First Publish Date - 2022-09-24T04:42:20+05:30 IST
పీడీసీసీ బ్యాంక్ చైర్మన్, వైసీపీ కొండపి నియోజకవర్గ మాజీ ఇన్చార్జి మాదాసి వెంకయ్య వర్గానికి చెందిన దాదాపు 500 మంది శుక్రవారం మధ్యాహ్నం భారీ ర్యాలీగా ఒంగోలు నుంచి బయల్దేరి విజయవాడ వెళ్లారు.
సజ్జలను కలిసి మాట్లాడిన వెంకయ్య వర్గీయులు
కొండపి నియోజకవర్గంలో అధికార వైసీపీలో మరోమారు లుకలుకలు బట్టబయలు
కొండపి, సెప్టెంబరు 23 : పీడీసీసీ బ్యాంక్ చైర్మన్, వైసీపీ కొండపి నియోజకవర్గ మాజీ ఇన్చార్జి మాదాసి వెంకయ్య వర్గానికి చెందిన దాదాపు 500 మంది శుక్రవారం మధ్యాహ్నం భారీ ర్యాలీగా ఒంగోలు నుంచి బయల్దేరి విజయవాడ వెళ్లారు. అక్కడ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ అప్పిరెడ్డిలను కలిశారు. నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ ఇన్చార్జిగా పనిచేస్తున్న వరికూటి అశోక్బాబు తమను కలుపుకొని వెళ్లడం లేదని ఫిర్యాదు చేశారు. పలు మండలాల్లో రేషన్ డీలర్లను, ఉపాధి హామీ పథకం ఫీల్డు అసిస్టెంట్లను తొలగిస్తున్నారని తెలిపారు. తమకు ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు కాకుండా అడ్డుకుంటున్నారని వారు వాపోయినట్లు తెలిసింది. ప్రస్తుతం జరుగుతున్న గడపగడపకు ప్రభుత్వం, ఇతర పార్టీ కార్యక్రమాలకు తమని ఆహ్వానించడం లేదని వెంకయ్య వర్గీయులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమానికి పిలిచినా మీరే వెళ్లడం లేదని, అందుబాటులో ఉండడం లేదని మరోవైపు నుంచి సమాచారం ఉందని అన్నట్లు తెలిసింది. భవిష్యత్లో ఇన్చార్జి బాధ్యతలు, పార్టీ టికెట్టు కూడా సర్వే ప్రకారం నిర్ణయిస్తామని వారికి చెప్పినట్లు సమాచారం. విజయవాడ వెళ్లిన వారిలో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డపాటి అరుణకుమారి, వైసీపీ నాయకులు బొట్ల రామారావు, పార్టీ మర్రిపూడి మండల కన్వీనర్ రమణారెడ్డి, నాగయ్య, నిడమనూరు రమణారెడ్డి, కొండపి మండలానికి చెందిన బి.ఉపేంద్ర చౌదరి, దివి శ్రీనివాసరావు, రాయుడు తదితరులు ఉన్నారు. ఈ చర్యతో అధికార వైసీపీలో మరోమారు లుకలుకలు బట్టబయలయ్యాయి.