ధాన్యం కొనుగోలు చేసి డబ్బు చెల్లించలేదు..
ABN , First Publish Date - 2021-07-24T05:08:47+05:30 IST
తమ వద్ద ధాన్యం కొనుగోలు చేసిన రైస్ మిల్లు నిర్వాహకులు డబ్బు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని బాధిత రైతులు శుక్రవారం రూరల్ ఎస్పీ విశాల్గున్నీని కలిసి ఫిర్యాదు చేశారు.
రూ.కోటిన్నరకు పైగా ఇవ్వాలని రైతుల ఆందోళన
రూరల్ ఎస్పీకి బాధితుల ఫిర్యాదు
గుంటూరు, జూలై 23: తమ వద్ద ధాన్యం కొనుగోలు చేసిన రైస్ మిల్లు నిర్వాహకులు డబ్బు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని బాధిత రైతులు శుక్రవారం రూరల్ ఎస్పీ విశాల్గున్నీని కలిసి ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పొన్నూరు పరిధిలోని మునిపల్లెలో సీతారామాంజనేయ రైస్మిల్లు నిర్వాహకులు వట్టికూటి శ్రీనివాసరావు, రమణయ్య, సత్యసాయి, రాయల్ వెల్లలూరు, బ్రాహ్మణకోడూరు, మంచాల, దండమూడి తదితర గ్రామాల్లోని రైతుల నుంచి గత ఏడాది పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేశారు. రోజులు గడుస్తున్నా డబ్బులివ్వకపోవటంతో బాధిత రైతులు మిల్లు నిర్వాహకులను నిలదీశారు. ఆ తర్వాత నుంచి వారు రైతులకు మొఖం చాటేశారు. దీంతో మాజీ సర్పంచ్ బండి శివరామప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం సుమారు 15 మంది రైతులు రూరల్ ఎస్పీని కలిసి న్యాయం చేయాలని కోరారు. సుమారు 100 మంది రైతులకు రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల వరకు వీరు ఇవ్వాల్సి ఉందని బాధితులు పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు ఎస్పీని కోరారు.