బ్యాంకుల పనివేళలు కుదింపు
ABN , First Publish Date - 2021-04-23T10:17:05+05:30 IST
కరోనా విజృంభణ నేపథ్యంలో ఉద్యోగులు, ఖాతాదారుల రక్షణ దృష్ట్యా బ్యాంకుల పని వేళలను కుదిస్తూ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎ్సఎల్బీసీ)
ఉదయం 10నుంచి మధ్యాహ్నం 2 వరకే
నేటి నుంచి 15 వరకు అమలు
అమరావతి(ఆంధ్రజ్యోతి)/పాయకాపురం, ఏప్రిల్ 22: కరోనా విజృంభణ నేపథ్యంలో ఉద్యోగులు, ఖాతాదారుల రక్షణ దృష్ట్యా బ్యాంకుల పని వేళలను కుదిస్తూ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి బ్యాంకులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పని చేయనున్నాయి. వచ్చేనెల 15 వరకు లేదా ఎస్ఎల్బీసీ తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఈ పని వేళలు అమలవుతాయి. అయితే స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆయా జిల్లాల యంత్రాంగం ఇతర నిర్ణయాలు తీసుకుంటే అవే అమలవుతాయని కమిటీ స్పష్టం చేసింది. కాగా అవకాశం, అవసరాన్ని బట్టి తమ శాఖలను తక్కువమంది సిబ్బందితో నడిపేందుకు లేదా వారికి ఇంటినుంచే పని చేసేందుకు అనుమతి ఇవ్వడంపై నిర్ణయాధికారాన్ని బ్యాంకులకే ఇచ్చింది. కరెన్సీ చెస్ట్లు, ఏటీఎంలలో నగదు జమచేసే వెండర్లు, ఏటీఎం బ్యాక్ ఆఫీసులు, క్లియరింగ్- బ్యాంకు ట్రెజరీ- ఫారెక్స్ బ్యాక్ కార్యాలయాలు, ‘స్విఫ్ట్’ సెంటర్లతో పాటు ఆయా బ్యాంకుల ప్రధాన కార్యాలయాల అధీకృత సెంటర్లు ఎప్పట్లాగానే పని చేస్తాయని పేర్కొంది.
కాగా, బ్యాంకింగ్ రంగ అధికారులు, ఉద్యోగులందరికీ కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్ఎల్బీసీ కోరింది. ఈ విషయంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్లు చొరవ తీసుకుని జిల్లా, స్థానిక అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించింది. అధికారులు, ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులకు కూడా కరోనా టీకాలు వేయించేలా చూడాలని ఎస్ఎల్బీసీ ఏపీ కన్వీనర్ కె.బ్రహ్మానందరెడ్డి సూచించారు.