పశువుల కాపరిని అటవీశాఖ అధికారులు చితకబాదారని ఆందోళన

ABN , First Publish Date - 2022-06-25T06:41:49+05:30 IST

పశువుల కాపరిని అటవీశాఖ అధికారులు చితకబాదారని ఆరోపిస్తూ మండలంలోని తర్లపాడ్‌ గ్రామస్థులు శుక్రవారం నిర్మల్‌, మంచిర్యాల్‌ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు.

పశువుల కాపరిని అటవీశాఖ అధికారులు చితకబాదారని ఆందోళన
రోడ్డుపై బైఠాయించిన తర్లపాడ్‌ గ్రామస్థులు

నిర్మల్‌ - మంచిర్యాల రహదారిపై ధర్నా

ఖానాపూర్‌, జూన్‌ 24 : పశువుల కాపరిని అటవీశాఖ అధికారులు చితకబాదారని ఆరోపిస్తూ మండలంలోని తర్లపాడ్‌ గ్రామస్థులు శుక్రవారం నిర్మల్‌, మంచిర్యాల్‌ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రతీరోజులాగే పశువుల కాపరి పూసం అన్ను గ్రామంలోని గేదెలను తీసుకొని అటవీ ప్రాంతానికి మేపడానికి వెళ్లాడని, గేదెలను మేపుతుండగా అటవీ అధికారులు అతన్ని పిలిచి చితకబాదారని తెలిపారు. ఆదివాసీ అని చూడకుండా ఓ పశువుల కాపరిని చితకబాదడం సరికాదని, అతనికి న్యాయం చేయాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. నిర్మల్‌, మంచిర్యాల రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి సీఐ అజయ్‌బాబు చేరుకొని గ్రామస్థులకు నచ్చజె ప్పడంతో గొడవ సద్దుమణిగింది. పశువుల కాపరిని కొట్టిన అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని సీఐ అజయ్‌బాబు అన్నారు. ఆయన వెంట ఎస్సై రజినీకాంత్‌, పోలీసుసిబ్బంది ఉన్నారు. ఈ విషయంపై ఖానాపూర్‌ ఎఫ్‌డీవో కోటేశ్వరరావును వివరణ కోరగా తర్లపాడ్‌ అటవీప్రాంతంలో గ్రాస్‌ ప్లాంటేషన్‌ ఉన్నాయని, వాటిలో పశువులను మేపకూడదని ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని, గ్రాస్‌ ప్లాంటేషన్‌లో పశువులను మేపడంతో బెదిరించామే తప్ప ఎవరిపై దాడి చేయలేదని అన్నారు. 

Updated Date - 2022-06-25T06:41:49+05:30 IST