ఆన్‌లైన్‌ క్లాసులపై అయోమయం!

ABN , First Publish Date - 2022-01-18T09:54:23+05:30 IST

ఈ సెలవుల సమయంలో ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహించాలా ? వద్దా ? అనే విషయంలో విద్యా శాఖ సందిగ్ధంలో పడింది.

ఆన్‌లైన్‌ క్లాసులపై అయోమయం!

  • నిర్వహిస్తామని యూనివర్సిటీల వెల్లడి.. 
  • వద్దంటూ ఇంటర్‌ బోర్డు ప్రకటన
  • ఎటూ చెప్పని పాఠశాల విద్యా విభాగం 
  • ప్రభుత్వం నుంచి కొరవడిన స్పష్టత 
  • ఎటూ తేల్చుకోలేని స్థితిలో విద్యా శాఖ


హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఈ సెలవుల సమయంలో ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహించాలా ? వద్దా ? అనే విషయంలో విద్యా శాఖ సందిగ్ధంలో పడింది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఏ నిర్ణయాన్ని తీసుకోలేని స్థితిలో అధికారులున్నారు. విద్యా సంస్థలకు ఈ నెల 17 నుంచి 30 వరకు ప్రత్యేక సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సెలవు రోజుల్లో ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహించనున్నట్టు జేఎన్‌టీయూ, ఉస్మానియా వంటి యూనివర్సిటీలు ప్రకటించాయి. కానీ, ఇంటర్‌ బోర్డు ఎలాంటి తరగతులను నిర్వహించవద్దని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీలకు వర్తిస్తుందని పేర్కొంది. మరోవైపు పాఠశాల విద్యా విభాగం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో రాష్ట్రంలో ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణ పట్ల అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఫిజికల్‌ తరగతులను సెప్టెంబరు 1 నుంచి ప్రారంభించారు.


ఇవి ఆలస్యంగా మొదలవడంతో ఈ విద్యా ఏడాదికి సంబంధించిన సిలబ్‌సను 70 శాతానికి కుదించారు. అయితే, 3 నెలల పాటు ప్రత్యక్ష తరగతులు జరిగినా.. ఇప్పుడు మళ్లీ కరోనా వల్ల సెలవులను ప్రకటించాల్సి వచ్చింది. రాబోయే రోజుల్లో కూడా కరోనా ఉధృతి ఇలాగే ఉండి, సెలవులను మరిన్ని రోజుల పాటు పొడిగించాల్సి వస్తే బోధన సంగతి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. అదే జరిగితే గతేడాది మాదిరిగానే ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహించాల్సి వస్తుంది. ఇప్పటి వరకు 40 శాతం సిలబస్‌ కూడా పూర్తి కాలేదని అధికారులు చెప్తున్నారు. పైగా గత రెండేళ్లుగా క్లాసులు సరిగ్గా లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. 


ఆన్‌లైన్‌ వైపు ప్రైవేటు మొగ్గు

మరో వైపు ప్రైవేటు విద్యా సంస్థలు ఆన్‌లైన్‌ క్లాసుల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే పలు విద్యా సంస్థలు ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహించడానికి వీలుగా ఏర్పాట్లను చేసుకున్నాయి. ఈ మేరకు విద్యార్థులకు కూడా సమాచారం అందించినట్టు సమాచారం. ప్రభుత్వం నుంచి వచ్చే సూచనలు, ఆదేశాలను పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయానికి రావాలని ప్రైవేటు విద్యా సంస్థలు భావిస్తున్నాయి. ఈ విషయంలో ఉన్నత పాఠశాలలు, ఇంటర్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌ కాలేజీల వంటి విద్యా సంస్థలకు సమస్యలు లేకపోయినా... ప్రాథమిక స్థాయి పాఠశాలలకు మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఆన్‌లైన్‌ విద్యా బోధన నిర్వహించడం అంత సులువైన అంశం కాదు. పైగా చాలా బడ్జెట్‌ స్కూళ్లల్లో విద్యార్థులు నెల వారీగా ఫీజులను చెల్లించే పద్ధతి ఉంది. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఫీజులను వసూలు చేయడం సాధ్యం కాదు. దీంతో ఆ స్కూళ్లు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొవాల్సి వస్తుందని అంచ నా వేస్తున్నారు.

Updated Date - 2022-01-18T09:54:23+05:30 IST