కర్ణాటక బీజేపీలో గొడవలపై మండిపడ్డ కాంగ్రెస్
ABN , First Publish Date - 2021-06-17T03:20:06+05:30 IST
కర్ణాటక బీజేపీలో గొడవలపై మండిపడ్డ కాంగ్రెస్
బెంగళూరు: కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల గురించి ఏమాత్రం ఆలోచన లేదని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఎంత సేపు అంతర్గత కుమ్ములాటలతో వార్తల్లో నిలవడమేకానీ రాష్ట్రంలో ప్రజల జీవన విధానం ఎలా ఉంది, వారి కష్టాలు ఏంటని ఆలోచించే తీరిక బీజేపీ నేతలకు లేనే లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో బీజేపీపై విమర్శలు చేస్తూ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు.
‘‘బీజేపీనే సంతోషంగా లేని ప్రభుత్వం ఇది. ప్రభుత్వం పట్ల అసంతృప్తి, నేతల పట్ల అసంతృప్తి, ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరిపై అసంతృప్తి. పార్టీ నిండా అసంతృప్తే. ప్రభుత్వం నిండా అసంతృప్తే. ప్రజలు భయాందోళనలో ఉంటే బీజేపీలో కుర్చీల మధ్య యుద్ధం జరుగుతోంది’’ అని ట్వీట్ చేశారు. ఇక మరో ట్వీట్లో ‘‘కర్ణాటకలో కొవిడ్ మరణాల సంఖ్యను దాస్తున్నారు. ఇది చాలా అవమానకరం. దీనికి వెనుక బీజేపీ ఉద్దేశం ఏంటి? ప్రజలను మోసం చేస్తున్నారా? వారికి ద్రోహం చేస్తున్నారా? ఇలాంటి సమయంలో పారదర్శకంగా పని చేయాల్సిన ప్రభుత్వం ఇలా ప్రవర్తించడం ఏంటి?’’ అని రాసుకొచ్చారు.