యూపీ ఎన్నికల ప్రచారం కోసం ‘శ్రీవల్లి’ ట్యూన్తో పాటను విడుదల చేసిన కాంగ్రెస్
ABN , First Publish Date - 2022-02-04T23:57:50+05:30 IST
ఉత్తరప్రదేశ్కు త్వరలో జరగనున్న ఎన్నికల్లో సత్తా చాటాలని గట్టి పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది.
లక్నో: ఉత్తరప్రదేశ్కు త్వరలో జరగనున్న ఎన్నికల్లో సత్తా చాటాలని గట్టి పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇందులో భాగంగా తాజాగా ఆ పార్టీ విడుదల చేసిన ఎన్నికల పాట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. టాలీవుడ్ స్టార్ నటుడు అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాలోని పాటలు, డ్యాన్సులు ఇప్పటికే పాపులర్ అయ్యాయి. క్రికెటర్ల నుంచి పలువురు ప్రముఖుల వరకు ఆ సినిమాలోని పాటలు, డ్యాన్సులు ట్రై చేస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. తాజాగా, ఈ ‘పుష్ప’ మేనియా రాజకీయాలకూ పాకింది.
యూపీలో ఈసారి తాడోపేడో తేల్చుకోవాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ తాజాగా తమ ఎన్నికల పాటను విడుదల చేసింది. యూపీ గొప్పతనాన్ని వర్ణిస్తూ రూపొందించిన ఈ పాట కోసం ‘పుష్ప’ సినిమాలో ‘చూపే బంగారామాయానే శ్రీవల్లీ..’ అనే పాట ట్యూన్ను తీసుకుని ‘తూ హై గజబ్ యూపీ, తేరీ కసమ్..’ (చాలా అందంగా ఉంటావు యూపీ..) అని సాగే వీడియో సాంగ్ను చిత్రీకరించింది. ‘ఉత్తర ప్రదేశ్ వాసులమైనందుకు గర్వంగా ఉంది’ అన్న క్యాప్షన్తో యూపీ కాంగ్రెస్ ఈ పాటను ట్విట్టర్లో షేర్ చేసింది.
ఉత్తరప్రదేశ్లో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతల ఎన్నికలు ఈ నెల 10న జరుగుతాయి. మార్చి 10న ఓట్లు లెక్కిస్తారు. 2017 ఎన్నికల్లోనూ యూపీలో ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 410 సీట్లకు గాను భారతీయ జనతా పార్టీ, దాని మిత్ర పక్షాలు 312 సీట్లు గెలుచుకున్నాయి. ఈసారి ఎన్నికల్లో బీజేపీ, అఖిలేశ్ యాదవ్ సారథ్యంలో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్, మాయావతి బహుజన్ సమాజ్ పార్టీ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.