Batti vikramarka: తెలంగాణ విలీన వజ్రోత్సవాలను ఘనంగా చేపట్టాలి

ABN , First Publish Date - 2022-09-03T18:41:32+05:30 IST

తెలంగాణ విలీన వజ్రోత్సవాలను ప్రభుత్వం ఘనంగా చేపట్టాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

Batti vikramarka: తెలంగాణ విలీన వజ్రోత్సవాలను ఘనంగా చేపట్టాలి

హైదరాబాద్: తెలంగాణ విలీన వజ్రోత్సవాలను ప్రభుత్వం ఘనంగా చేపట్టాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Batti vikramarka) డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ రాచరిక పాలన నుంచి స్వాతంత్రం వచ్చిన రోజన్నారు. 1947, ఆగస్టు 15న బ్రిటిష్ రాచరిక పాలన నుంచి భారత దేశానికి స్వాతంత్య్రం వస్తే 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రానికి నిజాం రాచరిక పాలన నుంచి స్వాతంత్రం వచ్చిందని వెల్లడించారు. దేశ తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రు, హోమ్ శాఖ మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్‌లు తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేసుకున్నారని తెలిపారు. దేశంలో స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఏడాది పాటు జరిగినట్టే తెలంగాణలో కూడా ఏడాది పాటు తెలంగాణ విలీన వజ్రోత్సవాలు ప్రభుత్వం అధికారికంగా జరపాలని ఆయన డిమాండ్ చేశారు.


ఈ తెలంగాణ విలీన వజ్రోత్సవాల సందర్భంగా నెహ్రు, పటేల్‌లతో పాటు తెలంగాణ విముక్తి పోరాటం చేసిన స్వామి రామనంద తీర్థ, సర్దార్ జమాలపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పివి నర్సింహారావు, చాకలి ఐలమ్మ, రావి నారాయణ రెడ్డి, అరుట్ల కమలమ్మ తదితర నిజాం వ్యతిరేక తెలంగాణ విముక్తి పోరాటంలో  ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం గౌరవించుకునేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని అన్నారు. ఏడాది పాటు వారి పోరాటాలు, త్యాగాలపై నేటి యువతరానికి గుర్తు చేసే విధంగా స్ఫూర్తినిచ్చే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ త్యాగధనుల వారసులను గుర్తించి వారిని తగిన విధంగా సన్మానాలు చేపట్టాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-09-03T18:41:32+05:30 IST