బీసీ కమిషన్లో ముస్లిం మైనార్టీలకు చోటు ఏది: దాసోజు శ్రవణ్
ABN , First Publish Date - 2021-08-25T02:25:27+05:30 IST
బీసీ కమిషన్లో ముస్లిం మైనార్టీలకు చోటు ఏది: దాసోజు శ్రవణ్
హైదరాబాద్: బీసీ కమిషన్లో ముస్లిం మైనార్టీలకు చోటు కల్పించకపోవడాన్ని ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్కుమార్ తప్పుబట్టారు. టీఆర్ఎస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి మైనార్టీలకు సముచిత స్థానం వస్తుందని ఆశించారని వారికి మరోసారి అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు. సీఎం కేసీఆర్ను నమ్ముకున్న వారికి దోకా మీద దోకా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ప్రతి ఒక్క ముస్లిం సోదరి, సోదరీమణులు ఆలోచించాల్సిన విషయమని దాసోజు శ్రవణ్ అన్నారు.
"240 జీవో జారీ చేస్తూ బీసీ కమిషన్ ఛైర్మన్గా టీఆర్ఎస్ నాయకుడు వకుళాభరణం కృష్ణమోహన్, సభ్యులుగా ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కిషోర్గౌడ్లను నియమించారు. ఇప్పటికైనా పునరుద్దరించినందుకు స్వాగతిస్తున్నాం. అయితే బీసీ కమిషన్లో మైనార్టీ వర్గాలకు సంబంధించిన వ్యక్తులకు చోటు లేకపోవడం బాధాకారం. గత ఏడేళ్లుగా వంచిస్తున్న కేసీఆర్, బీసీ కమిషన్లో మరోసారి వారిని మోసం చేశారు. ముస్లింలు అంటే కేవలం బిర్యానీ, షేర్వానీ, ఖుర్బానీ కోసమేనా?. ’’ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.
"కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలలను బీసీ-ఈ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించింది. ముస్లిం మైనార్టీలను అన్ని రకాలుగా ఆదుకుంది. వారి అభివృద్ధికి తోడ్పడింది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఏడేళ్లుగా అన్ని విధాలుగా నిర్లక్ష్యం చేసింది. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి నమ్మించి మోసం చేశారు. వక్ఫ్బోర్డ్కి జుడిషియల్ స్టేటస్ ఇస్తామని చెప్పి మాట తప్పారు. వక్స్బోర్డ్ భూములను కాపాడుతామని చెప్పిన సీఎం వాటి గురించి పట్టించుకోవడం లేదు. అలాగే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కి నిధులు మంజూరు చేయడం లేదు. రుణాల మంజూరు విషయంలో మైనార్టీలను పూర్తిగా విస్మరించారు. ఎన్నికల ముందు మైనార్టీలకు రిజర్వేషన్లు, నిధులు, ఉద్యోగాలు, రుణాలు ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటినికి అటకెక్కించారు. చివరికి కేసీఆర్ మైనార్టీలను ఓట్లు వేసే యంత్రాలుగా వాడుకుంటున్నారు.’’ అని డా. దాసోజు శ్రవణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.