Congress నేత Shivakumar పాఠశాలకు బాంబు బెదిరింపు
ABN , First Publish Date - 2022-07-19T16:28:09+05:30 IST
కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్కు చెందిన పాఠశాలకు బాంబు బెదిరింపు రావడంతో కలకలం రేగింది. బెంగళూరు నగరం రాజరాజేశ్వరీ
- రంగంలోకి తనిఖీ బృందాలు
బెంగళూరు, జూలై 18(ఆంధ్రజ్యోతి): కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్కు చెందిన పాఠశాలకు బాంబు బెదిరింపు రావడంతో కలకలం రేగింది. బెంగళూరు నగరం రాజరాజేశ్వరీ నగర్లోని హిల్వ్యూ పబ్లిక్ స్కూల్లో బాంబులు పెట్టినట్లు హెచ్చరిస్తూ ఆదివారం రాత్రి మెయిల్ ద్వారా సందేశం పంపారు. దీనిని స్కూల్ కమిటీ సభ్యులు ఎవరూ గమనించలేదు. సోమవారం స్కూల్ ప్రారంభానికి ముందుగానే వచ్చిన ఉద్యోగులు బాంబు మెయిల్ను గమనించారు. వెంటనే రాజరాజేశ్వరీ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే విద్యార్థులు పాఠశాలకు చేరుకోగా వెంటనే వారందరినీ ఒకటవ యూనిట్ నుంచి రెండో యూనిట్కు మార్పు చేశారు. బాంబుస్క్వాడ్ బృందాలు స్కూల్ ప్రాంగణంతో పాటు అన్ని గదులను తనిఖీ చేశాయి. డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య వెంటనే అక్కడికి చేరుకుని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ పాఠాశాలకు బాంబు పెట్టామనే సమాచారం మెయిల్ ద్వారా వచ్చిందన్నారు. ఉదయం 10 గంటలకు సిబ్బంది తెలుసుకున్నారని, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. పాఠశాల పరిధిలో ప్రత్యేక బృందాలు పరిశీలించాయన్నారు. బెంగళూరు పశ్చిమ విభాగం డీసీపీ లక్ష్మణ నింబరిగి మాట్లాడుతూ ఆర్ఆర్ నగర్లోని ఐడియల్ టౌన్షిప్ ఉండే పాఠశాలకు బాంబు బెదిరింపు విషయం తెలియగానే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామన్నారు. ఎటువంటి ఆనవాళ్లు లభించలేదన్నారు.