Sedition Law : సత్యం పలకడం దేశభక్తి అవుతుంది : రాహుల్ గాంధీ
ABN , First Publish Date - 2022-05-11T22:39:02+05:30 IST
బ్రిటిష్ కాలంనాటి రాజద్రోహ చట్టం (Sedition
న్యూఢిల్లీ : బ్రిటిష్ కాలంనాటి రాజద్రోహ చట్టం (Sedition Law) అమలును సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం ట్విటర్ వేదికగా స్పందించారు. సత్యం పలకడం దేశభక్తి అవుతుందని, రాజద్రోహం కాబోదని చెప్పారు. సత్యాన్ని వినడం కర్తవ్యమని, దానిని అణచివేయడం దురహంకారమని పేర్కొన్నారు. భయపడొద్దని ప్రజలను కోరారు.
భారత శిక్షా స్మృతి (IPC)లోని సెక్షన్ 124ఏ అమలును సుప్రీంకోర్టు (Supreme Court) తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ నిబంధనను పునఃపరిశీలించాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కసరత్తు కోసం వేచి చూడాలని కోరింది. దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షిస్తూనే, కాలం చెల్లిన వలస చట్టాలను తొలగించడానికి కట్టుబడి ఉన్నట్లు వివరించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ, ఈ రాజద్రోహ చట్టాన్ని నిలుపుదల చేయడం సరైనదవుతుందని తెలిపింది. రాజద్రోహం నేరారోపణలపై ఇకపై కొత్త కేసులను నమోదు చేయవద్దని రాష్ట్రాలకు తెలిపింది. ఈ నేరారోపణలపై ఇప్పటికే నమోదైన అన్ని కేసులు, అపీళ్ళపై విచారణను నిలిపేయాలని తెలిపింది. నిందితులకు మంజూరు చేసిన ఉపశమనం కొనసాగుతుందని వివరించింది. ఈ నేరారోపణలపై ప్రస్తుతం జైళ్ళలో ఉన్నవారు బెయిలు కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. తదుపరి విచారణ జూలైలో జరుగుతుందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇచ్చిన ట్వీట్లో, సత్యం పలకడం దేశభక్తి (Patriotism) అవుతుందని, రాజద్రోహం కాబోదని చెప్పారు. సత్యాన్ని వినడం రాజధర్మమని, దానిని అణచివేయడం దురహంకారమని పేర్కొన్నారు. భయపడొద్దని ప్రజలకు చెప్పారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను కాంగ్రెస్ పార్టీ కూడా స్వాగతించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా మాట్లాడుతూ, అసమ్మతిని అణచివేసేవారికి ఈ ఆదేశాల ద్వారా స్పష్టమైన ఓ సందేశం వెళ్ళిందన్నారు. ‘‘సత్యం తాలూకు గళాన్ని మీరు ఎంతో కాలం అణచివేయలేరు. ప్రభుత్వాన్ని విమర్శించేవారి వాదనను తప్పనిసరిగా వినాలి’’ అనే సందేశం వెళ్ళిందన్నారు.
సీపీఎం నేత సీతారాం ఏచూరి మాట్లాడుతూ, రాజద్రోహం చట్టాన్ని తాము ఎప్పుడూ వ్యతిరేకిస్తున్నామన్నారు. భారత దేశ స్వాతంత్ర్య సంగ్రామాన్ని అణచివేయడం కోసం బ్రిటిషర్లు తీసుకొచ్చిన అరాచక చట్టం ఇది అని చెప్పారు. స్వతంత్ర భారత దేశంలో దీనికి స్థానం లేదన్నారు. ఐపీసీ సెక్షన్ 124ఏ అమలును నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం మంచిదేనని చెప్పారు. పెండింగ్ కేసుల విచారణను నిలిపేయడం, కొత్త కేసులను నమోదు చేయవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పడం సరైనదేనని తెలిపారు.