మదనపల్లెలో లక్ష గొంతులతో జనగణమనను వినిపిస్తాం: sailajanath
ABN , First Publish Date - 2022-02-28T19:05:41+05:30 IST
వైసీపీ ప్రభుత్వం దేశ ద్రోహానికి ఒడిగట్టిందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ వ్యాఖ్యానించారు.
చిత్తూరు: వైసీపీ ప్రభుత్వం దేశ ద్రోహానికి ఒడిగట్టిందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ వ్యాఖ్యానించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ సాక్షాత్తు జాతీయ గీతాన్ని ఆలపించిన మదనపల్లె పట్టణంలో జాతీయ గీతాన్ని స్మరించుకునే అవకాశాన్ని కూడా కల్పించకుండా పోలీసు బలగాలతో వైసీపీ ప్రభుత్వం అణచి వేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం జాతీయ గీతాన్ని అవమానించేలా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ఠాగూర్ జాతీయ గీతాన్ని అనువదించిన మదనపల్లిలో జాతీయగీతం పాడేందుకు కూడా పోలీసులు అడ్డుకోవడం అమానుష చర్య అని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి దేశభక్తి అన్నా, స్వాతంత్రం విలువలు అన్న గౌరవం లేకుండా పోయిందని ఆయన విమర్శించారు.
జనగణమన గీతాన్నిమదనపల్లిలో ఫిబ్రవరి 28న బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి అనువదించిన రవీంద్రనాథ్ ఠాగూర్కు నివాళులర్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. త్వరలో మదనపల్లెలో జనగణమనను లక్ష గొంతులతో వినిపిస్తామని స్పష్టం చేశారు. జాతీయ గీతానికి వైసీపీ ప్రభుత్వం అవమానించే రీతిలో ప్రవర్తించిందని, దీన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు. ఈ ప్రభుత్వానికి పోలీసులు వంత పాడటం జాతీయ గీతాన్ని అవమానించినట్లే కనబడుతోందని తెలిపారు. మదనపల్లి బంద్ను అడ్డుకోవడానికి పోలీసులు ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధాన్ని తలపించారని శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.