సంక్షేమ పథకాలపై జగన్ డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదం: Tulasi reddy
ABN , First Publish Date - 2022-04-23T17:26:12+05:30 IST
సంక్షేమ పథకాల గురించి ముఖ్యమంత్రి జగన్ డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు.
అమరావతి: సంక్షేమ పథకాల గురించి ముఖ్యమంత్రి జగన్ డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. ఆంజనేయుని ముందు పిల్ల కోతి కుప్పి గంతులు వేసినట్లుందని వ్యాఖ్యానించారు. 1975లోనే శ్రీమతి ఇందిరా గాంధీ ప్రారంభించిన 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమంలో అన్ని సంక్షేమ పథకాలను చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేశాయన్నారు. జగన్ పాలనలో సంక్షేమం సంక్షోభంలో పడిందని తెలిపారు. అమ్మ ఒడి, ఆసరా, చేయూత తదితర సంక్షేమ పథకాల ద్వారా ఇస్తున్న నగదును నాన్న బుడ్డి ద్వారా ప్రభుత్వం లాక్కొంటోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేసిన అమ్మ హస్తం, బంగారు తల్లి తదితర మహిళా సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రారంభించిందని గుర్తుచేశారు. ఒక్కొక్క సంఘానికి కాంగ్రెస్ హయాంలో రూ.5 లక్షల వరకు సున్నా వడ్డీ పథకం వర్తించేదని, జగన్ పాలనలో రూ.3 లక్షలకు కుదించడమైందన్నారు. ముఖ్యమంత్రికి సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు పరచాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.