Chintan Shivir : పేపర్ బ్యాలట్తో ఎన్నికలు జరగాలి... కాంగ్రెస్ నేతల ప్రతిపాదన...
ABN , First Publish Date - 2022-05-15T21:50:34+05:30 IST
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు)పై కాంగ్రెస్ (Congress
ఉదయ్పూర్ (రాజస్థాన్) : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు)పై కాంగ్రెస్ (Congress) మేధోమథనం సమావేశాల్లో చర్చించారు. EVMలను ట్యాంపరింగ్ చేసే అవకాశాలపై మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేపర్ బ్యాలెట్లతో ఎన్నికల నిర్వహణ విధానాన్ని మళ్లీ ప్రవేశపెడతామని ఓ తీర్మానాన్ని ఆమోదించాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ ప్రతిపాదించారు.
రాజ్యసభ (Rajya Sabha)లో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) నేతృత్వంలోని రాజకీయ కమిటీలో అనేకమంది వక్తలు EVMల విశ్వసనీయతను ప్రశ్నించారు. చాలా మంది వక్తలు ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) శాసన సభ ఎన్నికల ఫలితాలను ప్రస్తావించారు. ఈవీఎంలపై సందేహాలను వ్యక్తం చేసేందుకు కొందరు కొన్ని పత్రికల్లో వచ్చిన వ్యాసాలను చూపించారు.
ఇదిలావుండగా, 2004, 2009లలో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించారు. అప్పట్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ విజయం సాధించింది. 2014 తర్వాత ఈవీఎంలను ఉపయోగించి జరిగిన ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్, తదితర పార్టీలు గెలిచాయి. ఈ యంత్రాలతో రిగ్గింగ్ చేయవచ్చునని చెప్పేందుకు సాక్ష్యాధారాలు లేవు.
ఈవీఎంలపై చర్చ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ (Election Commission) 2017లో అన్ని రాజకీయ పార్టీలకు సవాల్ విసిరింది. ఈ యంత్రాలను ట్యాంపరింగ్ చేయవచ్చునని నిరూపించాలని పిలుపునిచ్చింది. ఈవీఎంలతో రిగ్గింగ్ చేయవచ్చునని నిరూపించేందుకు చాలా పార్టీలు ప్రయత్నించాయి. కానీ రుజువు చేయలేకపోయాయి. దీంతో పేపర్ బ్యాలట్లను ఉపయోగించడానికి ఎన్నికల కమిషన్ అంగీకరించలేదు. అయితే ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (VVPAT)లను ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈవీఎంలకు వీవీప్యాట్లను జత చేసి, ప్రతి ఓటరు తాను వేసిన ఓటు సక్రమంగా పడిందో లేదో తెలుసుకోవచ్చునని చెప్పింది.
నవ సంకల్ప చింతన్ శివిర్ పేరుతో కాంగ్రెస్ మేధోమథనం సమావేశాలు రాజస్థాన్లోని ఉదయ్పూర్లో శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే.