2023 ఫిబ్రవరిలో ముందస్తు ఎన్నికలు?: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2022-01-11T01:09:23+05:30 IST

కాంగ్రెస్ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర

2023 ఫిబ్రవరిలో ముందస్తు  ఎన్నికలు?: జగ్గారెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 2023 ఫిబ్రవరిలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు కేసీఆర్ వెళ్తారని ఆయన పేర్కొన్నారు. నగరంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ పై ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో బీజేపీ విచిత్రమైన ఉద్యమాలు చేస్తోందన్నారు. తెలంగాణలో వారి తీరు నవ్వులాటలా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వరి పంచాయితీని తెచ్చింది కేంద్రంలోని బీజేపీయేనని ఆయన అన్నారు. జీవో 317 చిచ్చుకు మూల కారణం కేంద్రం అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రాంతం ప్రజలకు బీజేపీ సహకారం ఉండటం లేదని ఆయన ఆరోపించారు. తాను చేయాల్సిన పని చేయకుండా ఉద్వేగాలు రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూస్తోందన్నారు.


 ప్రతీ పేదవాని అకౌంట్ లో 15లక్షలు ఇస్తానని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికీ ఆ పని చేయలేదన్నారు. దీనికి  బీజేపీ నేతలు జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతీఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ఇప్పుడు ఉన్నవి ఊడగొడుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సింది పోయి సమస్యలను సృష్టిస్తోందన్నారు. నోట్ల రద్దుతో మొదలుకొని రైతు చట్టాల వరకు అన్ని సమస్యలను బీజేపీనే సృష్టించిందన్నారు. బీజేపీ విధానాలపై ప్రజలు ఆలోచించాలన్నారు.  వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ను ఆర్థిక పరమైన దెబ్బ కొట్టడానికి బీజేపీ ప్లాన్ చేస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు బీజేపీ కుట్రలపై లేఖ రాస్తానని ఆయన తెలిపారు. 

Updated Date - 2022-01-11T01:09:23+05:30 IST