పాకిస్థాన్కు వెళ్లి పరిశీలిస్తే ఇక్కడి స్వాతంత్య్రం విలువ తెలుస్తుంది
ABN , First Publish Date - 2022-06-07T17:00:16+05:30 IST
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలకు వెళ్లి పరిశీలిస్తే ఇక్కడి స్వాతంత్య్రం విలువ తెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత యూటీ ఖాదర్ వెల్లడించారు. మంగళూరు
- హిజాబ్ విద్యార్థినుల తీరుపై యూటీ ఖాదర్
బెంగళూరు, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలకు వెళ్లి పరిశీలిస్తే ఇక్కడి స్వాతంత్య్రం విలువ తెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత యూటీ ఖాదర్ వెల్లడించారు. మంగళూరు విశ్వవిద్యాలయానికి అనుబంధమైన కళాశాలల్లో హిజాబ్తో విద్యార్థినులు తరగతులకు వెళ్లాలనే వివాదంపై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వీరంతా ఓసారి పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్కు వెళ్లి పరిశీలించి రావాలన్నారు. అప్పుడే మన దేశ విలువ, సౌందర్యం, అవకాశాలు తెలుస్తాయన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు మన పరిస్థితి ఏంటో తెలుస్తుందని పేర్కొన్నారు. జిల్లా అధికారులతో మీటింగ్ చేయవచ్చునని, మీడియా ముందు వాదించవచ్చునని, ఇక్కడ బౌన్సర్లు, బాడీగార్డ్లు పొందినవారు కూడా అక్కడ పిల్లుల్లా ఉండాల్సిందేనని వివరించారు. అక్కడికి వెళ్లి వస్తేనే మన దేశ గొప్పదనం తెలుస్తుందన్నారు. విద్య ముందు మతాలు, కులాలు ఉండవన్నారు. విద్యద్వారానే భవిష్యత్తు, వ్యక్తిత్వం రూపొందించుకోవాలన్నారు. పిల్లలు దారి తప్పకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హిజాబ్పై పట్టుబట్టే విద్యార్థినులు అన్ని గమనించి వ్యవహరించాలన్నారు. విద్యార్థినులు క్రమశిక్షణ పాటించకపోవడంపై వారికి నోటీసులు జారీ చేశారు. కళాశాలలో 1600 మంది విద్యార్థులు ఉండగా కొందరు క్రమశిక్షణ పాటించకపోవడం సరికాదని, మూడురోజుల్లో వివరణ ఇవ్వాలని శనివారం నోటీసులు జారీ చేశారు.