Congress Chintan : కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ పాదయాత్రలు!
ABN , First Publish Date - 2022-05-15T16:39:14+05:30 IST
ప్రజలకు చేరువయ్యేందుకు పాదయాత్రలు, రచ్చబండలు నిర్వహించాలని
ఉదయ్పూర్ (రాజస్థాన్) : ప్రజలకు చేరువయ్యేందుకు పాదయాత్రలు, రచ్చబండలు నిర్వహించాలని కాంగ్రెస్ (Congress) యోచిస్తోంది. రాహుల్ గాంధీ (Rahul Gandhi) సహా సీనియర్ నేతలు పాల్గొనే ఈ కార్యక్రమాలు కశ్మీరు నుంచి కన్యా కుమారి వరకు జరుగుతాయని తెలుస్తోంది. ఆ పార్టీ మేధోమథనం సమావేశాల్లో భాగంగా ‘జన జాగరణ్ అభియాన్ 2.0’ కమిటీ ఈ ప్రతిపాదన చేసినట్లు సమాచారం.
రాజస్థాన్ (Rajastan)లోని ఉదయ్పూర్లో శుక్రవారం ప్రారంభమైన కాంగ్రెస్ నవ సంకల్ప చింతన్ శివిర్ (మేధోమథనం) సమావేశాల్లో వివిధ అంశాలపై వేర్వేరు కమిటీలు చర్చలు జరిపాయి. ప్రజలకు చేరువయ్యేందుకు, దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యపై ప్రజలను చైతన్యపరిచేందుకు కశ్మీరు నుంచి కన్యా కుమారి వరకు పాదయాత్రలు, రచ్చబండలు నిర్వహించాలని ‘జన జాగరణ్ అభియాన్ 2.0’ కమిటీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాలను ఓ ఏడాదిపాటు కొనసాగించాలని చెప్పినట్లు సమాచారం. నిరంతరాయ ఆందోళన కమిటీ చైర్పర్సన్ దిగ్విజయ సింగ్ (Digvijaya Singh) దీనికి సంబంధించిన సవివరమైన ప్రజంటేషన్ను ఇచ్చినట్లు, దీనిపై విస్తృత చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. యువజన కమిటీ కూడా ఇటువంటి సలహానే ఇచ్చిందని చెప్తున్నారు.