రైతులకు అండగా కాంగ్రెస్ పార్టి
ABN , First Publish Date - 2022-05-29T05:23:22+05:30 IST
రైతురాజ్యం కోసం, రైతులకు అండగా నిలవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుందని మాజీ మంత్రి షబ్బీర్అలీ అన్నారు.
కామారెడ్డి, మే 28: రైతురాజ్యం కోసం, రైతులకు అండగా నిలవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుందని మాజీ మంత్రి షబ్బీర్అలీ అన్నారు. శనివారం రాజంపేట మండల కేంద్రంలో రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ధనిక రాష్ట్రం నేడు నిధుల కోసం ఎందుకు దేహీ అంటోందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలతో కూడిన అసమానతలు లేని ఆత్మగౌరవంతో కూడిన సామాజిక తెలంగాణలో కొట్లాట ఇంకా మిగిలే ఉందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుచ్చి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీర్చిన సోనియమ్మ రుణం తీర్చుకుంటామని తెలిపారు. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ అబద్దపు, అన్యాయపు పాలనలో ఆగమైపోయిన తెలంగాణ రైతాంగానికి వరంగల్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రైతు సంఘర్షణ సభ తిరుగులేని సభ అని తెలిపారు. కేసీఆర్ అబద్దాల ప్రభుత్వాన్ని బొందపెడతామని, ధరణి పోర్టల్ను గంగలో కలుపుతామని తెలిపారు. రైతులు పిట్టల్లా రాలుతున్నా ఆత్మహత్య చేసుకున్నా కనీసం పరామర్శిచడం లేదని తెలిపారు. ఏ గ్రామానికి వెళ్లినా రైతులు వరి కుప్పల వద్ద ఎండలో నిరీక్షిస్తున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లారీల కొరత తీర్చాలని తెలిపారు. వరంగల్ డిక్లరేషన్పై రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్రావు, ఎల్లారెడ్డి నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డెపల్లి సుభాష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.