ఫ్రీగా సిలిండర్, స్కూటర్, స్మార్ట్ఫోన్..: కాంగ్రెస్ వరాల జల్లు
ABN , First Publish Date - 2021-11-01T21:35:54+05:30 IST
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలపై కాంగ్రెస్ పార్టీ వరాల జల్లు కురిపించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, స్కూటర్లు, స్మార్ట్ఫోన్లు, బస్సులో ప్రయాణం.. కల్పిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ప్రకటన చేశారు...
లఖ్నవూ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలపై కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, స్కూటర్లు, స్మార్ట్ఫోన్లు, బస్సులో ప్రయాణం.. కల్పిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ప్రకటన చేశారు. అంతే కాకుండా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరపున మహిళలకు 40 శాతం టికెట్లు ఇస్తామని ప్రియాంక ప్రకటించారు. కొద్ది రోజులుగా ‘లడ్కీ హూన్.. లడ్ సక్తా హూన్’ (ఆడపిల్లను, పోరాడగలను) అనే నినాదంతో మహిళలను అమితంగా ఆకట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి తాజా హామీలు ఎంత వరకు కలిసి వస్తాయో చూడాలి.
సోమవారం ప్రియాంక ప్రకటించిన వాగ్దానాలు..
- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం.
- రాష్ట్ర ప్రభుత్వ బసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.
- ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు 10,000 రూపాయల వేతనం.
- నూతన ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ను అనుసరించి మహిళలకు 40 శాతం ఉద్యోగాలు.
- వితంతువులకు ఒక్కొక్కరికి 1,000 రూపాయలు.
- ఉత్తప్రదేశ్కి చెందిన కథానాయకుల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 75 నైపుణ్య పాఠశాలల ఏర్పాటు.
- కాంగ్రెస్ పార్టీ తరపున మహిళలకు 40 శాతం టికెట్లు.
- బాలికా విద్యార్థులకు స్మార్ట్ ఫోన్, స్కూటీ.