యూపీ మాదే, బీజేపీకి 30 లోపు సీట్లు: కాంగ్రెస్

ABN , First Publish Date - 2021-12-14T21:11:10+05:30 IST

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు రాబోతున్నాయని, సంపూర్ణ మెజారిటీతో..

యూపీ మాదే, బీజేపీకి 30 లోపు సీట్లు: కాంగ్రెస్

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు రాబోతున్నాయని, సంపూర్ణ మెజారిటీతో తమ పార్టీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. బీజేపీకి 30 లోపు సీట్లు వస్తాయని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అజయ్ కుమార్ లల్లూ జోస్యం చెప్పారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు లేనప్పటికీ, యూపీలోని చిన్న పార్టీలకు తమ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. ఏయే పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని అడిగినప్పుడు, రాజకీయాల్లో ప్రతీదీ బహిరంగం చేయలేమని, చాలానే మార్పులు వస్తాయని, వేచిచూడమని ఆయన సమాధానమిచ్చారు.


కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్‌పీ కలిసి పోటీ చేసినా బీజేపీని ఓడించలేవని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను లల్లూ కొట్టివేశారు. బీజేపీకి 30 సీట్ల కంటే ఎక్కువ రావని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాగానే బీజేపీ నేతలు ఓట్ల కోసం ప్రజలు వెళ్తారని, అప్పుడు ఏమి జరుగుతుందో చూడండని అన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మహిళా భద్రత, శాంతి భద్రతలు వంటి అంశాలను ప్రజలను బీజేపీ నేతలను నిలదీయనున్నారని చెప్పారు. ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని, గెలుపుపై బీజేపీ పెట్టుకున్న ఆశలన్నీ నీటిమూటలుగానే మిగిలిపోనున్నాయని అన్నారు.


పెను మార్పు.. పేరు ప్రియాంక..

యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆశ్చర్యకరమైన ఫలితాలను రాబట్టనుందని, ప్రజలు కూడా చాలా ఆసక్తితో ఉన్నారని లల్లూ చెప్పారు. అన్ని పార్టీలకు ఒక అవకాశం ఇచ్చిన ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వనున్నారని, కాంగ్రెస్ స్పష్టమైన మోజారిటీని సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పేదలు, యువత, రైతులు ఈసారి కాంగ్రెస్ వెంటే ఉన్నారని, మహిళల భద్రత, శాంతి భద్రతలతో సహా తాము ఇస్తున్న తొమ్మిది హామీలతో ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన పోటీదారుగా నిలవనుందన్నారు. ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ''పెను మార్పు రాబోతోంది. ఆ మార్పు పేరు ప్రియాంక గాంధీ'' అని అజయ్ కుమార్ లల్లూ అన్నారు.

Updated Date - 2021-12-14T21:11:10+05:30 IST