Murder: నంద్యాల నడిరోడ్డుపై కానిస్టేబుల్ హత్య

ABN , First Publish Date - 2022-08-08T21:29:32+05:30 IST

ఓ కానిస్టేబుల్‌ సురేంద్రను గుర్తు తెలియని దుండగులు సినీ ఫక్కీలో బీరు బాటిళ్లతో దాడి చేసి, హత్య చేశారు.

Murder: నంద్యాల నడిరోడ్డుపై కానిస్టేబుల్ హత్య

నంద్యాల (Nandyala): ఓ కానిస్టేబుల్ (Conistable) పనిమీద టైలరింగ్ షాపు వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడ మాటు వేసివున్న దుండగులు అతనిని వెంబడించి, కిడ్నాప్ (Kidnap) చేసి మరీ హత్య (Murder) చేశారు. సినీ ఫక్కీలో నంద్యాల నడిరోడ్డుపై కానిస్టేబుల్ సురేంద్ర హత్య తీవ్ర కలకలం రేపుతోంది. నంద్యాలలో డీఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సురేంద్రను నిన్న రాత్రి కొందరు దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. స్థానిక రాజ్ థియేటర్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు కానిస్టేబుల్‌పై బీర్ బాటిళ్లతో దాడి చేసి.. ఆటోలో కిడ్నాప్ చేసి.. కత్తులతో పొడిచి హత్య చేశారు. 


కానిస్టేబుల్ తిరుమల వెళ్లడానికి చినిగిన బ్యాగ్‌ను కుట్టించుకోడానికి టైలర్ షాపుకు వచ్చారు. ప్రక్కన టాటూ సెంటర్‌లో ఉన్న రౌడీ షీటర్లు, కానిస్టేబుల్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో దుండగులు బీరు బాటిళ్లతో సురేంద్రపై దాడి చేశారు. దీంతో కానిస్టేబుల్ రోడ్డుపై పరుగుపెట్టారు. అయినప్పటికీ వదలకుండా దుండగులు వెంటాడి పట్టుకుని, ఆటోలో ఎక్కించి.. చెరువు కట్టవద్దకు తీసుకువెళ్లి కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను అదే ఆటోలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందాడు. దుండగులు తనను కొట్టి కానిస్టేబుల్‌ను బలవంతంగా తన ఆటో ఎక్కించారని డ్రైవర్ తెలిపాడు. సురేంద్రను కొట్టవద్దని చెప్పినా దుండగులు వినలేదని ఆటో డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. కానిస్టేబుల్‌ను హత్య చేసింది.. ముగ్గురు రైడీ షీటర్లు, మరో ఇద్దరు నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.

Updated Date - 2022-08-08T21:29:32+05:30 IST