పోలీసులకే టోపీ వేసిన దొంగ.. నచ్చిన చోటకు ట్రాన్స్ఫర్ ఇప్పిస్తానంటూ మోసం
ABN , First Publish Date - 2022-04-12T08:38:44+05:30 IST
ఎవరైనా సామాన్యులు మోసపోతే పోలీసులను ఆశ్రయిస్తారు. మరి పోలీసులే మోసపోతే? ఏం చేయాలి. సరిగ్గా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని పూణేలో వెలుగు చూసింది. ఒక వ్యక్తి పుణెలోని పింప్రి చించ్వాడ్ పరిసర ప్రాంతాల్లో..
ఎవరైనా సామాన్యులు మోసపోతే పోలీసులను ఆశ్రయిస్తారు. మరి పోలీసులే మోసపోతే? ఏం చేయాలి. సరిగ్గా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని పూణేలో వెలుగు చూసింది. ఒక వ్యక్తి పుణెలోని పింప్రి చించ్వాడ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కొన్ని పోలీసు స్టేషన్లకు నేరుగా కాల్ చేశాడు.
పోలీస్ స్టేషన్లలో కొందరు అధికారులతో మాట్లాడి.. తను పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పుకున్నాడు. సదరు పోలీసు అధికారికి ట్రాన్స్ఫర్ జరగబోతోందని, మంచి స్థానానికి ట్రాన్స్ఫర్ కావాలంటే తనకు గూగుల్ పేలో కొంత మొత్తం డబ్బు చెల్లించాలని చెప్పేవాడు. కొందరు పోలీసులు అతని మాటలు నమ్మి డబ్బులు పంపారు కూడా. కానీ వాళ్లెవరికీ ట్రాన్స్ఫర్ నోటీసులు రాకపోవడంతో తాము మోసపోయినట్లు గ్రహించారు.
తమను ఇలా ఒక వ్యక్తి మోసం చేశాడని పింప్రి చించ్వాడ్ కమిషనర్ కృష్ణ ప్రకాష్కు సమాచారం అందించారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఈ మోసానికి పాల్పడిన వ్యక్తిని అమిత్ జగన్నాథ్ కాంబలేగా గుర్తించారు. అతను మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో ఇలాంటి మోసాలకు పాల్పడి పోలీసులకు టోపీ పెట్టినట్లు అధికారులు చెప్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని, అమిత్కు ఇలా మోసం చేయడంలో ఇంకెవరైనా సాయం చేస్తున్నారేమో అని దర్యాప్తు చేస్తున్నారు.