నియోజకవర్గానికో కొవిడ్ కేర్ సెంటర్
ABN , First Publish Date - 2021-04-23T08:04:05+05:30 IST
నియోజకవర్గానికో కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ హరినారాయణన్ ఆదేశించారు.
ఆస్పత్రులు, సెంటర్లలో వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి: కలెక్టర్
తిరుపతి(రవాణా), ఏప్రిల్ 22: నియోజకవర్గానికో కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ హరినారాయణన్ ఆదేశించారు. గురువారం తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో జేసీలు వీరబ్రహ్మం, రాజశేఖర్, వైద్యాధికారులతో సమీక్షించారు. సత్యవేడు, కార్వేటినగరంలోనూ వచ్చేవారం నుంచి కొవిడ్ కేర్ సెంటర్లు ప్రారంభించాలని సూచించారు. ఇక కొవిడ్ ఆస్పత్రులు, సెంటర్లలో వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. బాధితుల పరిస్థితిని ఎప్పుటికప్పుడు తెలుసుకుని, మరణాల సంఖ్య తగ్గింపునకు కృషి చేయాలని కోరారు. సీరియస్ కేసులను గుర్తించి, అత్యవసర చికిత్స అందిస్తే.. ప్రాణాలను కాపాడిన వారమవుతామని చెప్పారు. ‘వైద్యపరీక్షలు ఆలస్యం కాకుండా ప్రైవేట్ ల్యాబ్లవారు ఆరోగ్యశ్రీ ధరలకు చేసేలా చూడాలి. రుయా, స్విమ్స్లో అత్యవసర సేవలు మినహా జనరల్, ఓపీ ఆపేయండి. ముఖ్యంగా ఆక్సిజన్ విషయంలో రుయా, స్విమ్స్లో అప్రమత్తత అవసరం. ప్రస్తుతమున్న ప్లాంటు సరిపోయినా కూడా బల్క్ సిలిండర్లు అందుబాటులో ఉంచుకోవాలి. బాధితులకు అందుతున్న ఆహారం మరింత నాణ్యతగా ఉండాలి. తంబళ్లపల్లె, సత్యవేడు వంటి దూర ప్రాంతాల్లో 104 వాహనాల ద్వారా పరీక్షలు నిర్వహించేలా సిద్ధం చేయాలి. దీనిని మెడికల్ వేస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్యవేక్షించాలి’ అని కలెక్టర్ పేర్కొన్నారు. డీఎంహెచ్వో పెంచలయ్య, డీసీహెచ్ఎస్ సరళమ్మ, స్విమ్స్ మెడికల్ ఆఫీసర్ రామ్, కొవిడ్ కేర్ సెంటర్ల నోడల్ అధికారులు లక్ష్మి (పద్మావతి నిలయం), దశరథరామిరెడ్డి (విష్ణునివాసం), వెంకటరమణారెడ్డి (ఈఎస్ఐ), ఆయుర్వేదిక్ ఆస్పత్రి ప్రిన్సిపాల్ మురళీకృష్ణ, ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ జయభాస్కర్, సెట్విన్ సీఈవో మురళీకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.