కలుషిత నీరు సరఫరా

ABN , First Publish Date - 2022-08-08T05:32:10+05:30 IST

కలుషిత నీరు సరఫరా

కలుషిత నీరు సరఫరా
ఫిల్టర్‌ బెడ్‌లో నామమాత్రంగా శుద్ధి అయిన నీరు

  • పూర్తిగా శుద్ధికాకుండానే తాగునీటి విడుదల
  • ‘మిషన్‌ భగీరథ’ బంద్‌తో శివసాగర్‌ చెరువు నీటి పంపిణీ
  • ముందు చెప్పని అధికారులు.. అనారోగ్యం బారిన ప్రజలు

వికారాబాద్‌, ఆగస్టు 7: వికారాబాద్‌ పట్టణానికి మూడు రోజులుగా మిషన్‌ భగీరథ తాగు నీరు బంద్‌ కాగా మున్సిపల్‌ అధికారులు శివసాగర్‌ చెరువు నీటిని సరఫరా చేస్తున్నారు. కానీ శివసాగర్‌ చెరువులోకి వచ్చే నీరు పూర్తిగా మడ్డితో కూడుకొని ఎర్రగా ఉంటోంది. దాన్ని ఫిల్టర్‌ బెడ్లలో నామమాత్రంగా శుద్ధి చేసి ఎర్రగా ఉన్న నీటినే తాగేందుకు వికారాబాద్‌ వాసులకు సరఫరా చేస్తున్నారు. దీనికి తోడు ఏళ్లక్రితం ఏర్పాటు చేసిన పైపులైన్ల ద్వారానే నీటిని సరఫరా చేస్తుండడంతో ఎక్కడ పడితే అక్కడ పైపులైన్‌ లీకేజీ అవుతూ నీరు మరింత కలుషితం అవుతోంది. ప్రజలు నీటిని తాగు తూ అనారోగ్యం బారిన పడుతున్నారు. పూర్తిగా శుద్ధికాని నీటిని సరఫరా చేస్తున్న అధికారులు నల్లా నీటిని కాచి వడపోసి తాగాలనైనా ప్రజలకు తెలియజెప్పడం లేదు. మిషన్‌ భగీరథ నీరే వస్తోందని, వానలకు రంగుమారి ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. ఆ నీటినే తాగుతున్నారు. మిషన్‌ భగీరథ నీటి సరఫరాలో సమస్యలు తలెత్తితే ప్రత్యామ్నాయంగా శివసాగర్‌ చెరువు నీటిని శుద్ధి చేసి సిద్ధంగా ఉంచాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలేవీ తీసుకోకపోవడం వల్లే ప్రజలకు పరిశుద్ధమైన నీటిని అందించలేకపోతున్నారు. ఈ విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ శరత్‌చంద్రను వివరణ కోరగా ఎర్రగా వచ్చే నీటిని తాగొద్దని లైన్‌మెన్‌ ద్వారా ప్రజలకు తెలియజేయిస్తామన్నారు.

Updated Date - 2022-08-08T05:32:10+05:30 IST