ఆర్థిక సమస్యలతో కూలీ ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-10-27T06:07:53+05:30 IST
ఆర్థిక సమస్యలతో కూలీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన గంగవరం మండలం బత్తలకుంట గ్రామసమీపంలో మంగళవారం వెలుగుచూసింది.
గంగవరం,అక్టోబరు26: ఆర్థిక సమస్యలతో కూలీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన గంగవరం మండలం బత్తలకుంట గ్రామసమీపంలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు... మండలంలోని పసపత్తూరు పంచాయతీ బత్తలకుంట సమీపంలోని వ్యవసాయ బావిలో ఓ మృతదేహం నీటిపై తేలుతుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. సుమారు వారం క్రితమే మృతిచెందడంతో మృతదేహం ఉబ్బి గుర్తుపట్టలేనివిధంగా తయారైంది. చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు విచారించగా చనిపోయిన వ్యక్తి శంకర్రాయలపేటకు చెందిన కృష్ణమూర్తి (56)గా నిర్ధారించారు. కృష్ణమూర్తి కూలీ పనులు చేయడంతో పాటు నిడిగుంట ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేసే తన భార్యకు సహాయంగా ఉండేవాడు. కాగా వచ్చే డబ్బు కుటుంబపోషణకు సరిపోకపోవడంతో కృష్ణమూర్తి నెల క్రితం పనుల కోసం బెంగళూరులో ఉండే బంధువుల ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో 10 రోజుల క్రితం బెంగళూరు నుంచి ఊరికి వస్తున్నట్లు భార్యకు ఫోన్చేసిన కృష్ణమూర్తి ఆ తర్వాత ఇంటికి చేరుకోలేదు. ఆర్థిక సమస్యలతోనే కృష్ణమూర్తి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అతడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకరరెడ్డి తెలిపారు.