Udaipur హంతకులకు జైలులో Biryani.. ఏమాత్రం నిజం లేదన్న పోలీసులు

ABN , First Publish Date - 2022-06-29T23:20:03+05:30 IST

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ దారుణ హత్యా ఘటనలో పట్టుబడిన ఇద్దరు నిందితులకు..

Udaipur హంతకులకు జైలులో Biryani.. ఏమాత్రం నిజం లేదన్న పోలీసులు

జైపూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ దారుణ హత్యా ఘటనలో పట్టుబడిన ఇద్దరు నిందితులకు జైలులో బిర్యానీ సరఫరా చేశారంటూ వస్తున్న వార్తలను రాజస్థాన్ పోలీసులు ఖండించారు. ఇది పూర్తిగా తప్పుడు వార్త అని, ఇందులో ఎంతమాత్రం నిజం లేదని తెలిపారు. ''అరెస్టు తర్వాత ఇద్దరు ఉదయ్‌పూర్ హంతకులకు రాజస్థాన్‌ జైలులో బిర్యానీ సరఫరా చేశారు. ఇదే యూపీలో (ఉత్తరప్రదేశ్‌లో) అయితేనా?'' అనే శీర్షికతో ఒక హిందీ న్యూస్ వెబ్ సైట్ వార్త ఇచ్చింది. ప్రస్తుతం ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు.


కాగా, జైలులో నిందితులకు బిర్యానీ సరఫరా చేశారన్న వార్తలను రాజస్థాన్ పోలీసులు ఒక ట్వీట్‌లో తోసిపుచ్చారు. ''ఒక తప్పుడు వార్త వైరల్ అవుతోంది. నేరస్థులపై ఉదయ్‌పూర్‌లో కఠిన చర్యలు తీసుకుంటున్నాం. క్రిమినల్స్‌తో పోలీసులు మెతకగా వ్యవహరించేది లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు మేము కట్టుబడి ఉన్నాం'' అని ఆ ట్వీట్‌లో తెలిపారు. ఫేక్ న్యూస్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా ట్వీట్‌కు జతచేశారు. ఉదయ్‌పూర్‌లో టైలర్ దారుణ హత్య అనంతరం స్వల్ప ఘటనలు మినహా ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగింది. ఈ కేసును ఎన్ఐఏ (NIA)కు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2022-06-29T23:20:03+05:30 IST