కొవిడ్ సోకిన 66 మంది ప్రయాణికులతో ముంబై చేరిన కార్డిలియా క్రూయిజ్ నౌక

ABN , First Publish Date - 2022-01-05T02:21:23+05:30 IST

కరోనా సోకిన 66 మంది ప్రయాణికులతో కూడిన కార్డిలియా క్రూయిజ్ నౌక మంగళవారం సాయంత్రం ఆరు

కొవిడ్ సోకిన 66 మంది ప్రయాణికులతో ముంబై చేరిన కార్డిలియా క్రూయిజ్ నౌక

ముంబై: కరోనా సోకిన 66 మంది ప్రయాణికులతో కూడిన కార్డిలియా క్రూయిజ్ నౌక మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ముంబై ఓడరేవుకు చేరుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోర్టుకు చేరుకున్న బీఎంసీ సిబ్బంది ప్రయాణికులతోపాటు సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. నౌకలోని మిగతా ప్రయాణికులకు కూడా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల్లో నెగటివ్ రిపోర్టులు వచ్చే వరకు ఎవరినీ నౌక నుంచి కింది దిగేందుకు అనుమతించరు. 


కరోనా సోకిన 66 మందినీ రిచర్డ్‌సన్, క్రుడాస్ లేదంటే పెయిడ్ హోటళ్లకు తరలించి ఐసోలేషన్‌లో ఉంచనున్నారు. మిగతా వారు మాత్రం నౌకలోనే ఉండాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. వీరికి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించనుండగా బుధవారం ఉదయం 9 గంటలకు రిపోర్టులు వస్తాయని భావిస్తున్నారు. టెస్టు రిపోర్టులు వచ్చిన తర్వాతే ప్రయాణికులను నౌక నుంచి దిగేందుకు అనుమతిస్తారు.


నెగటివ్ వచ్చిన వారు ఇంట్లో ఏడు రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు తెలిపారు. నౌకలో మొత్తం 2,016 మంది ప్రయాణికులు ఉండగా, అందరి నుంచి  నమూనాలు సేకరించి పరీక్షించారు. వీరిలో 66 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.  

Updated Date - 2022-01-05T02:21:23+05:30 IST