రిటైర్డ్ ఉద్యోగి మృతి.. స్థానికుల అనుమానంతో కరోనా పరీక్షకు పంపిస్తే..
ABN , First Publish Date - 2020-07-13T15:42:29+05:30 IST
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదివారం 33 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 12, సూర్యాపేట జిల్లాలో 5, యాదాద్రి జిల్లాలో 16 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కాగా, కరోనా పాజిటివ్ తో చికిత్స పొందుతూ నల్లగొండ జిల్లాలో
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 33 పాజిటివ్ కేసులు.. చికిత్స పొందుతూ ఇద్దరి మృతి
నల్లగొండ(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదివారం 33 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 12, సూర్యాపేట జిల్లాలో 5, యాదాద్రి జిల్లాలో 16 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కాగా, కరోనా పాజిటివ్ తో చికిత్స పొందుతూ నల్లగొండ జిల్లాలో ఇద్దరు మృతిచెందా రు. మునుగోడుకు చెందిన ఒకరు హైదరాబ్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో, మిర్యాలగూడకు చెందిన మరొకరు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్, గొల్లగూడ ఆస్పత్రి ఏరియా, నిడమనూరు, కనగల్, చిట్యాలలో ఒకటి చొప్పున 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు, మిర్యాలగూడ పట్టణంలో ఐదు, మునుగోడులో రెండు పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్లో ఇద్దరు, కలాల్వాడలో ఒకరు, ఇస్లాంపురలో మరొకరికి పాజిటివ్ వచ్చింది. ఇస్లాంపురలో ఓరిటైర్డ్ ఉద్యోగి ఈ నెల 9వ తేదీన మృతిచెందగా, స్థానికుల అనుమానం మేరకు వైద్యులు నమూనాలను పరీక్షకు పంపగా, ఆదివారం పాజిటివ్ వచ్చింది.
మునుగోడు మేజర్ పంచాయతీ కమ్మగూడెంకు చెందిన ఓ యువకుడికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అతడిని యశోద ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్ చేశారు.
చిట్యాల మండలంలోని పిట్టంపల్లి గ్రామంలో ఒకరికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అతడితోపాటు కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్ చేశారు.
భువనగిరి పట్టణంలో ఏడుగురికి పాజిటివ్ వచ్చింది. బొమ్మలరామారం మండలం చీకటిమామిడికి చెందిన ఒకరికి పాజిటివ్ నిర్ధారణ అయింది.
వలిగొండ మండలంలోని గోకారం గ్రామానికి చెందిన ఒకరు హైదరాబాద్ ఎర్రగడ్డ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. అరూరు గ్రామానికి చెందిన మరొకరు బీబీనగర్ ఎయిమ్స్లో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయింది. కాగా, పట్టణానికి చెందిన ఓ హెల్త్ అసిస్టెంట్కు శనివారం పాజిటివ్ రాగా, ఆయన కాంటాక్టులు 15 మందిని హోంక్వారంటైన్ చేశారు.
భూదాన్పోచంపల్లి మండలంలోని ఇంద్రియాల గ్రామానికి చెందిన బొల్లేపల్లిలో మెడికల్ షాప్లో పనిచేసే వ్యక్తికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కాగా, మండల వ్యాప్తంగా ఆదివారం 22మందిని అధికారులు హోంక్వారంటైన్ చేశారు.
రాజాపేట మండలంలోని కుర్రారం గ్రామానికి చెందిన ఒకరికి పాజిటివ్ వచ్చింది. అతడు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, ఆయన కుటుంబ సభ్యులు నలుగురిని హోంక్వారంటైన్ చేశారు. రాజాపేట మండల కేంద్రంలో ఒకరికి పాజిటివ్ వచ్చింది.
ఆత్మకూరు(ఎం) మండలంలోని మోదుగుకుంట గ్రామానికి చెందిన ఒకరు జ్వరంతో బాధపడుతూ నాలుగు రోజుల క్రితం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. అతడితో సన్నిహితంగా మెలిగిన ఐదుగురిని హోంక్వారంటైన్ చేశారు.
అడ్డగూడూరు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ సిబ్బంది ఒకరికి పాజిటివ్ నిర్ధారణ అయింది.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. దీంతోపాటు కోదాడలో మూడు కేసులు నమోదయ్యాయి.
మేళ్లచెరువు మండలంలోని రామాపురంలో ఒకరికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అతడిని, కుటుంబసభ్యులను హోంకార్వంటైన్ చేశారు.
చింతలపాలెం మండలంలోని దొండపాడు గ్రామంలో 41 వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అనంతగిరి మండలంలోని కొత్తగోల్తండాకు పది రోజుల క్రితం హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్లిన ఓ మహిళకు పాజిటివ్ వచ్చింది. విషయం తెలుసుకున్న వైద్యసిబ్బంది ఆమె కాంటాక్టులను గుర్తించి హోంక్వారంటైన్ చేశారు. గ్రామంలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.
హాలియా మునిసిపాలిటీ పరిధిలో మాస్క్లు లేకుండా తిరుగున్న 50 మందికి ఎస్ఐ శివకుమార్ జరిమానా విధించారు.
మర్రిగూడ మండల కేంద్రంలో ఆదివారం స్వచ్ఛంద లాక్డౌన్ పాటించారు.