మేడ్చల్లో పెరుగుతున్న కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-07-26T05:29:36+05:30 IST
మేడ్చల్లో పెరుగుతున్న కరోనా కేసులు
- ఒక్కరోజే కరోనాతో ఇద్దరి మృతి
మేడ్చల్: మేడ్చల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ కన్నా ముందే కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం ఒక్కరోజే మేడ్చల్ మున్సిపల్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు కరోనాతో మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. కరోనా ముప్పు తొలగిపోయిందనే భావనతో ప్రజలు నిర్లక్ష్యంగా ఉన్నందునే తిరిగి కేసులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. లాక్డౌన్ నిబంధనలు సడలింపుతో ప్రజలు గుంపులుగుంపులుగా తిరగడం, ఫంక్షన్లు, రాజకీయ కార్యక్రమాలు, షాపింగ్లు, తదితర కార్యక్రమాలకు వెళ్తుండటం, మాస్క్లు ధరించకపోవడం వంటి కారణంగా మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు పండుగల సీజన్ కావడంతో ప్రజలు భౌతికదూరం పాటించకుండా, మాస్క్లు ధరించకుండా తిరగడం కూడా కరోనా వ్యాప్తికి కారణమవుతోంది. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అంతే సంగతులని, ఇప్పటికైనా తగిన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.