కరోనా కేసులపై వైద్య మంత్రి ఆరా
ABN , First Publish Date - 2021-04-19T05:26:34+05:30 IST
జిల్లాలో కరోనా కలకలంపై ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని ఆరా తీశారు.
కర్నూలు(హాస్పిటల్), ఏప్రిల్ 18: జిల్లాలో కరోనా కలకలంపై ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని ఆరా తీశారు. జిల్లాలోని ఆదోని శంకర్నగర్లో ఉన్న కస్తూర్బాగాంధీ స్కూల్లో విద్యార్థులకు కరోనా నిర్ధారణ కావడంతో డీఎంహెచ్వో డా.బి.రామగిడ్డయ్యను మంత్రి అప్రమత్తం చేశారు. ఆదివారం ఉదయం మంత్రి డీఎంహెచ్వోతో ఫోన్లో మాట్లాడారు. తక్షణమే ఆదోని కస్తూర్బా స్కూల్లో మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనిపై డీఎంహెచ్వో మాట్లాడుతూ ఆదోని డిప్యూటీ డీఎంహెచ్వో డా.రంగనాయక్ పర్యవేక్షణలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండడంతో కొవిడ్ సోకిన విద్యార్థులను హోం ఐసోలేషన్లో ఉంచినట్లు డీఎంహెచ్వో వివరించారు. ప్రతిరోజు జిల్లాలో 3,500 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్వో మంత్రికి వివరించారు.