పెళ్లి కూతురు తండ్రికి పాజిటివ్..వాయిదాపడ్డ వివాహం
ABN , First Publish Date - 2020-08-09T07:23:05+05:30 IST
తెల్లవారితే వివాహం జరగాల్సి ఉంది. ఇంతలో పెళ్లి కూతురు తండ్రి అస్వస్థతకు గురయ్యాడు. అనుమానం వచ్చి కరోనా పరీక్ష చేయించడంతో..
- 7న 101 మందికి వైరస్
- వైరస్ బారినపడి ముగ్గుకి మృతి
- శనివారం పలువురికి సోకిన వైరస్
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
తెల్లవారితే వివాహం జరగాల్సి ఉంది. ఇంతలో పెళ్లి కూతురు తండ్రి అస్వస్థతకు గురయ్యాడు. అనుమానం వచ్చి కరోనా పరీక్ష చేయించడంతో పాజిటివ్ వచ్చింది. దీతో ఆ పెళ్లి నిలిచిపోయింది. వీణవంక మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ఒక యువతి పెళ్లి ఆదివారం ఉదయం 8 గంటలకు జరగాల్సి ఉన్నది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అస్వస్థతతో ఉన్న పెండ్లి కూతురు తండ్రికి కరోనా పరీక్షలు నిర్వహించగా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో అతనితోపాటు కుటుంబసభ్యులందరిని కరీంనగర్లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ పరిణామంతో అమ్మాయి పెళ్లి వాయిదాపడింది.
జిల్లాలో కరోనా బారిన పడి శనివారం మరో ముగ్గురు మరణించారు. ఇల్లందకుంట మండలంలోని కనగర్తికి చెందిన 80 సంవత్సరాల వృద్ధుడు, గంగాధర మండలం ఉప్పరమల్యాలకు చెందిన 72 సంవత్సరాల వృద్ధురాలు కోవిడ్ బారిన పడి కరీంనగర్ ప్రభుత్ద ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. నగరంలోని జ్యోతినగర్కు చెందిన మరో వ్యక్తి హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు.
పెరుగుతున్న తీవ్రత
ఈనెల 7న జిల్లాలో 101 మందికి కరోనా వ్యాధి సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తన బులిటెన్లో వెల్లడించింది. ఈనెల 1 నుంచి వ్యాధి తీవ్రత పెరుగడం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. 1న 93 మందికి, 2న 54 మందికి, 3న 101 మందికి, 4న 41 మందికి, 5న 123 మందికి, 6న 93 మందికి, 7న 101 మందికి కరోనా వైరస్ సోకింది. వీరిలో అత్యధికులు ఇళ్లలోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. శనివారం హుజురాబాద్ మండలంలో 16 మందికి, జమ్మికుంట మండలంలో ఎనిమిది మందికి, వీణవంక మండలంలో ముగ్గురికి, ఇల్లందకుంట మండలంలో నలుగురికి, రామడుగులో ఇద్దరికి, తిమ్మాపూర్, మానకొండూర్, సైదాపూర్ మండలాల్లో ఒక్కొక్కరికి కరోనా వ్యాధి సోకింది. స్థానికుల సమాచారం మేరకు కరీంనగర్ పట్టణంలోని వివిధ డివిజన్లలో సుమారు 50 మందికి కరోనా వ్యాధి నిర్ధారణ అయినట్లు తెలిసింది.