కరోనా నియంత్రణ.. సామాజిక బాధ్యత
ABN , First Publish Date - 2021-04-24T04:57:08+05:30 IST
కరోనా నియంత్రణ సామాజిక బాధ్యతగా భావించాలని ఐటీడీఏ పీవో ఆర్.కూర్మనాథ్ తెలిపారు. శుక్రవారం జోగెమ్మపేటలో ఉన్న బాలయోగి గురుకుల పాఠశాలను పరిశీలించారు.
కొవిడ్ నిర్మూలనకు ప్రతిఒక్కరూ సహకరించాలి
ఐటీడీఏ పీవో ఆర్.కూర్మనాథ్
సీతానగరం, ఏప్రిల్ 23: కరోనా నియంత్రణ సామాజిక బాధ్యతగా భావించాలని ఐటీడీఏ పీవో ఆర్.కూర్మనాథ్ తెలిపారు. శుక్రవారం జోగెమ్మపేటలో ఉన్న బాలయోగి గురుకుల పాఠశాలను పరిశీలించారు. కొవిడ్ కేంద్రంగా మార్చడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, అవకాశాలపై ఆరా తీశారు. అనంతరం పీవో, సబ్కలెక్టర్ విధేఖర్ మాట్లాడుతూ.. కరోనా నిర్మూలనకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. విధిగా మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని, చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలని సూచించారు. కరోనా బాధితులు బయట తిరగ రాదన్నారు. హోం ఐసోలేషన్లోనే ఉండాలని తెలిపారు. పరిశీలనలో ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ కిరణ్కుమార్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కంటైన్మెంట్ జోన్లు ప్రకటన
పార్వతీపురం/ గరుగుబిల్లి: గ్రామాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు కంటైన్మెంట్ జోన్లను ప్రకటిస్తూ పార్వతీపురం సబ్కలెక్టర్ విఽధేఖర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. డివిజన్ పరిధిలోని బొబ్బిలికి సంబంధించి గొల్లపల్లి, కోరాడవీధి, గౌడవీధి, కృష్ణాపురం, అరుగువీధి, జీహెచ్ రోడ్డు, తెర్లాం మండలానికి చెందిన తెర్లాం, బాడంగి మండలంలోని వాడాడ, బలిజిపేట మండలంలోని బలిజిపేట, సాలూరు మం డలంలోని నాయుడువీధి, జియ్యమ్మవలస మండలంలోని జియ్యమ్మవలస, కొమరాడ , సీతానగరం, పాచిపెంట, గరుగుబిల్లి మండలాలకు సంబంధించి గరుగుబిల్లి, రావి వలస, కురుపాం మండలంలో గుమ్మ, రామభద్రపురం, పార్వతీపురం పట్టణంలోని జగన్నాథపురం, బెలగాం, గుమ్మలక్ష్మీపురం మండలంలో తాడికొండ ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.
24 గంటల్లో కొవిడ్ ఫలితాలు తెలపండి
దాసన్నపేట: కొవిడ్ పరీక్షలు చేసుకున్నవారి ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చూడాలని సీఐటీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.అప్పలసూరి, టీవీ రమణ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎల్బీజీ భవనంలో వారు మాట్లాడుతూ.. ప్రతి పది మందిలో ఒకరికి కరోనా లక్షణాలు ఉన్నాయన్నారు. ఇప్పటివరకూ జరిపిన పరీక్షలు పరిశీలిస్తే.. నలుగురిలో ఒకరికి కరోనా పాజిటివ్ వస్తుందన్నారు. చాలా మంది పరీక్షలు చేయిం చుకోవడానికి కేంద్రాలకు వస్తున్నా.. సకాలంలో ఫలితాలు రావడం లేదన్నారు. పాజిటివ్ వచ్చిన వారు ఫలితాలు సరిగ్గా రాకపోవడంతో అయోమయ పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు ఉంటున్నారన్నారు. జిల్లాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తగు చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్ హరిజవహర్లాల్కు వినతిపత్రం ఇచ్చారు. సీఐటీయూ ప్రతినిధులు రవికుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.