కరోనా .... 1474

ABN , First Publish Date - 2021-04-23T06:51:41+05:30 IST

జిల్లాలో బుధ, గురువారాల నడుమ 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 1474 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా అదే వ్యవధిలో కొవిడ్‌ బారిన పడి ఐదుగురు మరణించారు.

కరోనా .... 1474

కొవిడ్‌ కేసుల్లో మన జిల్లాకే ప్రథమస్థానం

మరో ఐదుగురు వైరస్‌తో మృత్యువాత

రాళ్ళబుదుగూరు స్టేషన్‌లో ఎస్‌ఐ సహా 12మందికి పాజిటివ్‌

తిరుపతిలో రాత్రి 7 గంటలకే షాపుల 

మూసివేత.... మార్కెట్ల వికేంద్రీకరణ

సోమలలో మధ్యాహ్నం 

3 నుంచే దుకాణాల బంద్‌

నియోజకవర్గానికో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ 

ఏర్పాటుకు కలెక్టర్‌ నిర్ణయం


తిరుపతి, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బుధ, గురువారాల నడుమ 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 1474 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా అదే వ్యవధిలో కొవిడ్‌ బారిన పడి ఐదుగురు మరణించారు. తాజా కేసులు, మరణాలతో జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన కరోనా కేసుల మొత్తం సంఖ్య 105153కు, మరణాల సంఖ్య 935కు చేరుకున్నాయి. మరోవైపు గురువారం ఉదయం 9 గంటల సమయానికి జిల్లాలో యాక్టివ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య రాష్ట్రంలోనే అత్యధికంగా 10318కి చేరింది. జిల్లాలో ఇప్పటిదాకా గుర్తించిన మొత్తం కరోనా కేసుల సంఖ్య కూడా రాష్ట్రంలో రెండవ అత్యధికం కావడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో గుర్తించిన పాజిటివ్‌ కేసుల్లో తిరుపతిలోనే 581, తిరుపతి రూరల్‌ మండలంలో 102, చిత్తూరులో 98 వున్నాయి. మదనపల్లెలో 54, రేణిగుంటలో 51, శ్రీకాళహస్తిలో 42, ఎర్రావారిపాళ్యంలో 40, పుత్తూరులో 30, గుర్రంకొండలో 29, ములకలచెరువులో 28, కార్వేటినగరంలో 26, చంద్రగిరిలో 23, జీడీనెల్లూరులో 22, సదుంలో 20, బి.కొత్తకోట, నగరి మండలాల్లో 19 వంతున, పుంగనూరులో 18, శ్రీరంగరాజపురంలో 16, ఏర్పేడులో 15, పీలేరు, వడమాలపేట, వరదయ్యపాళ్యం, వెదురుకుప్పం మండలాల్లో 13 చొప్పున, కుప్పం, రొంపిచెర్ల మండలాల్లో 11 వంతున, పాకాల, పీటీఎం, తవణంపల్లె మండలాల్లో 10 వంతున, నారాయణవనం, రామచంద్రాపురం మండలాల్లో 9 వంతున, పెద్దపంజాణి, తొట్టంబేడు, యాదమరి మండలాల్లో 8 వంతున, కలకడ, పూతలపట్టు మండలాల్లో 7 వంతున, చిన్నగొట్టిగల్లు, తంబళ్ళపల్లె మండలాల్లో 6 వంతున, బీఎన్‌ కండ్రిగ, పలమనేరు, పెనుమూరు, పులిచెర్ల మండలాల్లో 5 వంతున, బంగారుపాళ్యం, కేవీపల్లె, కురబలకోట, పిచ్చాటూరు, సోమల మండలాల్లో 4 వంతున, గుడిపాల, రామకుప్పం, వాల్మీకిపురం మండలాల్లో 3 వంతున, చౌడేపల్లె, గంగవరం, కేవీబీపురం, శాంతిపురం మండలాల్లో 2 వంతున, బైరెడ్డిపల్లె, గుడుపల్లె, కలికిరి, నాగలాపురం, నిమ్మనపల్లె, నిండ్ర, రామసముద్రం, వి.కోట మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి. శాంతిపురం మండలం రాళ్ళబుదుగూరు పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ సహా 12 మంది సిబ్బందికి కరోనా సోకింది.ఇటీవల తిరుపతి  ఉప ఎన్నికల  విధులకు వెళ్ళి వచ్చిన వీరంతా కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. తిరుపతిలో కొవిడ్‌ బాధితులొకరికి ఎమ్మెల్యే తనయుడు, కార్పొరేటర్‌ భూమన అభినయరెడ్డి రక్తదానం చేశారు.నియోజకవర్గానికి ఒక కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ నిర్ణయించారు.తిరుపతి నగరంలో కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇకపై రాత్రి 7 గంటల నుంచే దుకాణాలను మూసివేయాలని తొలి సమావేశంలోనే తిరుపతి మున్సిపల్‌ కౌన్సిల్‌ తీర్మానించింది.అలాగే నగరంలో జనం రద్దీని తగ్గించేందుకు తిరుపతిలోని ప్రధాన మున్సిపల్‌ మార్కెట్‌ ఇందిరా ప్రియదర్శినీ మార్కెట్‌ను వికేంద్రీకరించి 7-8 చోట్ల ఏర్పాటు చేయాలని తీర్మానించింది.శ్రీకాళహస్తిలో వ్యాపారులతో సమావేశమైన మున్సిపల్‌ అధికారులు కూరగాయల మార్కెట్‌ను ఒకే చోట కాకుండా నాలుగు చోట్ల ఏర్పాటు చేయాలని, చేపల మార్కెట్‌ను ఇపుడున్న ఇరుకు ప్రాంతం నుంచీ విశాలమైన చోటకు మార్చాలని, వస్త్ర దుకాణాలు, హోటళ్ళలో రద్దీ లేకుండా చూడాలని ఆదేశించారు.సోమల మండల కేంద్రంలో వ్యాపారులు స్వచ్చందంగా మధ్యాహ్నం 3 గంటల నుంచే దుకాణాలు మూసివేయాలని నిర్ణయించారు. చౌడేపల్లె మండలంలో కరోనా దెబ్బకు అంగన్‌వాడీ కేంద్రాలు బోసిపోతున్నాయి. తల్లిదండ్రులు వైరస్‌ భయంతో పిల్లలను కేంద్రాలకు పంపడం లేదు.


  ప్రైవేట్‌ హాస్పిటళ్లలో పడకల వివరాలివే

తిరుపతి (వైద్యం), ఏప్రిల్‌ 22 : కరోనా బాధితులకు వైద్యసేవలందించేందుకు మరిన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు సిద్ధమయ్యాయి.కలెక్టర్‌ అనుమతి పొందిన ప్రధాన  ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న పడకల వివరాలను వైద్యాధికారులు గురువారం ప్రకటించారు.ఆరోగ్యశ్రీ కార్డుతో నగదు రహిత కొవిడ్‌ వైద్యసేవలందించే 12 ఆస్పత్రుల్లో బెడ్ల వివరాలు...కుప్పంలోని పీఈఎస్‌ ఐఎంఎ్‌సఆర్‌ హాస్పిటల్‌ (175 బెడ్లు),తిరుపతిలోని మారుతి హాస్పిటల్‌ (38), రమాదేవి మల్టీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ (120), నారాయణాద్రి హాస్పిటల్‌ (127), ఎంజీఎం హాస్పిటల్‌ (40), డీబీఆర్‌ అండ్‌ ఎస్‌కే హాస్పిటల్‌ (40), రష్‌ హాస్పిటల్‌(57), బోత్‌ హాస్పిటల్‌ (25), చంద్రమోహన్‌ నర్సింగ్‌ హోమ్‌ (27), సంకల్ప హాస్పిటల్‌ (120), శ్రీచక్ర హాస్పిటల్‌ (30), చిత్తూరులోని ఆర్వీఎస్‌ హాస్పిటల్‌ (50)చొప్పున మొత్తం 849 పడకలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.నగదుతో కూడిన వైద్య సేవలందించే 14 హాస్పిటళ్లను అధికారులు ఎంపిక చేశారు.పీలేరులోని ప్రసాద్‌ హాస్పిటల్‌ (40 బెడ్లు), తిరుపతిలోని లోటస్‌ ఎమర్జెన్సీ హాస్పిటల్‌ (68), ఎలైట్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌(36),సురక్ష హాస్పిటల్‌ (65),   శ్రీ హాస్పిటల్‌ (50),అంకుర హాస్పిటల్‌ (70),సూర్య హాస్పిటల్‌ (38),  మాధురి రెమిడీ హాస్పిటల్‌ (50), మదనపల్లెలోని మేరీ లోట్‌లైయ్సి హాస్పిటల్‌ (40), సుభాషిణి హాస్పిటల్‌ (55),  కె.ఆర్‌.హాస్పిటల్‌ (30), విష్ణుశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ (50),కరకంబాడి సమీపంలోని అమర హాస్పిటల్‌ (100), రేణిగుంట సమీపంలోని సీఆర్‌ఎస్‌ రైల్వే హాస్పిటల్‌ (55), చొప్పున మొత్తం 747 బెడ్లు సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. 


కొవిడ్‌ సెంటర్లలో 553 పడకల ఖాళీ 

తిరుపతిలో ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో గురువారం రాత్రి 10 గంటలకు 553 పడకలు ఖాళీగా ఉన్నాయి. పద్మావతి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో 1000 పడకలుండగా అన్నీ ఫుల్లయ్యాయి. విష్ణు నివాసం గదుల్లో 800, డార్మెటరీలో 126 బెడ్స్‌ ఉన్నాయి. గదులన్నీ నిండిపోయాయి. 100 డార్మెటరీ బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి.  రుయాలో 108 నాన్‌ ఆక్సిజన్‌, 269 ఆక్సిజన్‌, ఐసీయూలో 76 ఆక్సిజన్‌ బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. రుయాలో వెంటిలేటర్‌ బెడ్లు మాత్రం ఖాళీ లేవు. 


పల్లెల్లో కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు

 గ్రామాల్లో కరోనా నివారణకు పంచాయతీ శాఖ ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టినట్లు డీపీవో దశరథరామిరెడ్డి చెప్పారు. పల్లెల్లో పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరచడం, హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి చికిత్స అందించడం, కరోనా పట్ల అవగాహన కల్పించడం , వలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేపట్టి కేసుల వివరాలను సేకరించడం చేస్తామని వెల్లడించారు.కరోనా బాధితులను ఆస్పత్రులకు పంపడం, హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి చికిత్స అందించే బాధ్యతలను ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లకు అప్పగిస్తున్నామన్నారు. బాధితుల సంఖ్యను బట్టి గ్రామాలను జోన్లుగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.


ఇద్దరు డీవైఈవోలకు కరోనా

  విద్యాశాఖలోని ఇద్దరు డీవైఈవోలకు కరోనా సోకడంతో వారి స్థానంలో ఇన్‌చార్జిలను నియమించారు.విద్యాశాఖలో ఏడీ, చిత్తూరు డీవైఈవో  పురుషోత్తంకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఈయన స్థానంలో డీఈవో కార్యాలయ సీ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ సురే్‌షకు , తిరుపతి డీవైఈవో విజయేంద్రరావుస్థానంలో కార్వేటినగరం డైట్‌ లెక్చలర్‌ జయరానాయుడికి అదనపు బాధ్యతలు అప్పగించారు. 


కరోనా మృతులకు దహనక్రియలు నిర్వహిస్తాం

 కరోనాతో మృతి చెందిన వారి దహనక్రియలు నిర్వహించేందుకు మాలమహానాడు ఐక్యవేదిక సిద్ధంగా వుందని జిల్లా ప్రఽధాన కార్యదర్శి మురళి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా బాధితులు,  మృతుల పట్ల వివక్ష చూపుతుండడంతో మానవ సంబంఽధాలు దెబ్బతింటున్నాయన్నారు. కాబట్టి ‘నేను సైతం’ సంఘ సభ్యుల ద్వారా దహన క్రియలు నిర్వహిస్తామన్నారు. వివరాలకు 95730 62042 నెంబరులో సంప్రదించాలన్నారు. 


కోర్టుల్లోనూ 50శాతం ఉద్యోగులే

   చిత్తూరు లీగల్‌, ఏప్రిల్‌ 22: నేటి నుంచి జిల్లాలోని న్యాయస్థానాలు 50 శాతం మంది ఉద్యోగులతోనే పనిచేయనున్నాయి. కరోనను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు కోర్టు సిబ్బంది షిప్టుల వారీగా విఽధులను నిర్వహించనున్నారు. 


  నేటినుంచి బ్యాంకు పనివేళల్లో మార్పు

       చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 22: జిల్లాలో బ్యాంకుల పనివేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం బ్యాంకులు ఉదయం 10నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తున్నాయి. అయితే కరోనా ఉధృతి నేపథ్యంలో శుక్రవారం నుంచి మే 15వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ప్రజలకు బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో ఉంటాయి.పలువురు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పించడంతో పరిమిత సిబ్బందితోనే బ్యాంకులు పనిచేస్తాయి. 


Updated Date - 2021-04-23T06:51:41+05:30 IST