మరణాలు.. కలవరం
ABN , First Publish Date - 2020-08-09T10:09:06+05:30 IST
జిల్లాలో కరోనా మరణాలు కలవర పెడుతున్నాయి. కొద్ది రోజుల నుంచి రోజూ సగటున 8 మంది చనిపోతున్నారు.
- 24 గంటల్లో 10 మంది మృతి
- 238కి చేరిన కరోనా మృతుల సంఖ్య
- కొత్తగా 1,353 మందికి వైరస్
- 8 రోజుల్లో 9,085 పాజిటివ్ కేసులు
కర్నూలు(హాస్పిటల్), ఆగస్టు 8: జిల్లాలో కరోనా మరణాలు కలవర పెడుతున్నాయి. కొద్ది రోజుల నుంచి రోజూ సగటున 8 మంది చనిపోతున్నారు. శనివారం 24 గంటల్లోనే 10 మంది కరోనా బాధితులు కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. దీంతో మరణాల సంఖ్య 238కి చేరింది. గత 8 రోజుల్లో 43 మంది మృతి చెందారు. శనివారం ఒక్కరోజే కొత్తగా 1353 మంది కరోనా బారిన పడ్డారు. తాజా కేసులతో కలిపి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 26037కు చేరుకుంది. వీటిలో 9480 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 16,314 మంది కరోనా నుంచి డిశ్చార్జి అయ్యారు. గత 5 రోజుల్లోనే 9,085 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
ర్యాపిడ్ కిట్ల కొరత
జిల్లాలోని కొన్ని పీహెచ్సీ, సీహెచ్సీల్లో ర్యాపిడ్ కిట్ల కొరత వేధిస్తోంది. కోవెలకుంట్ల సీహెచ్సీలో ర్యాపిడ్ కిట్లు లేకపోవడంతో పరీక్షలు చేయడం లేదని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నెల 7న ర్యాపిడ్ కిట్లతో 218 మందికి పరీక్షలు నిర్వహించారు. 8న 397 మందికి టెస్టులు చేశారు. ప్రారంభంలో 500 నుంచి 600 దాకా ర్యాపిడ్ కిట్లతో పరీక్షలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఈ కిట్లతో పరీక్షలు తక్కువగా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కరోనా లక్షణాలతో పరీక్షలు చేయించుకుందామనే వారికి నిరాశ ఎదురవుతోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం జిల్లాలో ర్యాపిడ్ కిట్ల కొరత లేదని చెబుతున్నారు. వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులున్న వారికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ర్యాపిడ్ కిట్లతో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వారానికి జిల్లాకు 30 వేల ర్యాపిడ్ కిట్లు వస్తున్నాయని, వీటిని సీహెచ్సీ, పీహెచ్సీ, అర్బన్ హెల్త్సెంటర్లకు సరఫరా చేస్తున్నామని చెబుతున్నారు.
57 మంది డిశ్చార్జి
జిల్లా కొవిడ్ ఆసుపత్రుల్లో కరోనా నుంచి విముక్తి పొంది 57 మంది శనివారం డిశ్చార్జి అయ్యారు. కర్నూలు జీజీహెచ్ స్టేట్ కొవిడ్ ఆసుపత్రి నుంచి 28 మంది, శాంతిరాం జిల్లా ప్రభుత్వ కొవిడ్ ఆసుపత్రి నుంచి 24 మంది, విశ్వభారతి జిల్లా కొవిడ్ ఆసుపత్రి నుంచి ఐదుగురు డిశ్చార్జి అయ్యారు. గత రెండు రోజుల్లో కొవిడ్ ఆసుపత్రులు, హోం ఐసోలేషన్లో ఉన్న బాధితులు 2379 మంది కోలుకుని బయటకు వచ్చారు.